
అందని బోనస్..
● సన్న వడ్లు విక్రియించిన రైతుల ఎదురుచూపులు ● 36,950 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ● రూ.18.47 కోట్ల బకాయి
బూర్గంపాడు: సన్నరకం ధాన్యం పండించిన రైతులకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వం అందిస్తామన్న బోనస్ రైతుల ఖాతాల్లో జమకాలేదు. యాసంగిలో రైతులు ఎక్కువగా దొడ్డురకం వరిని సాగు చేస్తారు. ప్రభుత్వం రూ.500 బోనస్గా అందిస్తామని ప్రకటించటంతో ఈ యాసంగిలో జిల్లాలో రైతులు 65 శాతం విస్తీర్ణంలో సన్నరకం వరినే సాగు చేశారు. అయితే యాసంగిలో సన్నరకం ధాన్యం పండించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన రైతులకు ఇప్పటి వరకు బోనస్ అందలేదు. వానాకాలం సీజన్ ఆరంభమైనా బోనస్ అందకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ధాన్యం కొన్నప్పటికీ..
ఈ యాసంగిలో జిల్లాలో 55,243 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో 36,950 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. సన్నరకం ధాన్యానికి సంబంధించి రైతులకు రూ. 18.47 కోట్లు బోనస్ కింద అందాల్సి ఉంది. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.2,320 ప్రభుత్వం మద్దతు ధరఇచ్చింది. దీంతో పాటు సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తోంది. సన్నరకం వడ్లుపండించటంలో ఎన్నో వ్యయ ప్రయాసలున్నాయి. సన్నరకం వరికి తెగు ళ్లు, చీడపీడలు, దోమపోటు ఎక్కువగా ఉంటాయి. దీంతో పెట్టుబడులు పెరుగుతాయి. ప్రభుత్వంబోనస్ అందిస్తుందనే ఆశతో రైతులు సన్నరకం వరిసాగుకు మొగ్గుచూపారు. యాసంగి ధాన్యంఅమ్మి నెలన్నర రోజులు కావస్తున్నా బోనస్ డబ్బులు అందకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు బోనస్ అందుతుందో లేదోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఆలస్యమవుతున్న బోనస్..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు వారం రోజుల వ్యవధిలో ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం నగదు బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది. అయితే ప్రభుత్వం అందించే బోనస్ మాత్రం ఒకింత ఆలస్యంగా జమవుతోంది. గత వానాకాలం సీజన్లో కూడా రైతులకు అందాల్సిన బోనస్ ఆలస్యమైంది. వానాకాలం సీజన్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యం అమ్మిన రైతులకు కొంత ఆలస్యంగానైనా బోనస్మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమైంది.దీంతో రైతులు యాసంగిలో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సన్నరకం వరిని సాగు చేశారు. ధ ుుంచి యాభై రోజులు దాటినా ఇప్పటి వరకుబోనస్ రాకపోవటంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వానాకాలం పెట్టుబడులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
పది రోజుల్లో పడొచ్చు
జిల్లాలో సన్న ధాన్యం విక్రయించిన రైతుల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందించాం. వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో బోనస్ నగదు జమయ్యే అవకాశం ఉంది.
–రుక్మిణి,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
118 క్వింటాళ్లు విక్రయించా..
యాసంగిలో 118 క్వింటాళ్ల సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. అందుకు గాను క్వింటాకు రూ.500 చొప్పున రూ.59 వేలు బోనస్ రావాలి. వడ్లు అమ్మి నెలన్నర దాటింది. బోనస్ వస్తే మళ్లీ పెట్టుబడులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం యాసంగి బోనస్ను వెంటనే విడుదల చేయాలి. –వెలమ రమేశ్, రైతు, మల్లెలమడుగు,
అశ్వాపురం మండలం
రూ.10 వేలు రావాలి
యాసంగిలో 20 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. అందుకు గాను నాకు రూ.10 వేలు రావాలి. బోనస్ వస్తుందని యాభై రోజులుగా ఎదురుచూస్తున్నాను. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలి.
–మాదాసు గోవర్దన్,
రైతు, కారెగట్టు, పాల్వంచ మండలం

అందని బోనస్..

అందని బోనస్..