
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
సూపర్బజార్(కొత్తగూడెం): మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించా లని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయ సమావేశాన్ని జిల్లా ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, గంజాయి, మత్తు పదార్థాలు వినియోగించకుండా కళాశాల యాజమాన్యా లు, తల్లదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దులు, చెక్పోస్టుల వద్ద నిరంతర నిఘా పెట్టాలని సూచించారు. అటవీ శాఖాధికారులు గంజాయి సాగు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతినెలా తనిఖీ చేయా లని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పీడి యాక్టు నమోదు చేస్తాం
మాదకద్రవ్యాలు వినియోగించినా, రవాణా చేసినా పీడీ యాక్టు నమోదు చేస్తామని ఎస్పీ రోహిత్రాజ్ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కేజీల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా మాదకద్రవ్యాలను గుర్తించేందుకు రెండు నార్కోటిక్ డాగ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, భద్రాచలంలో డీఎడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. సమీక్షలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్సింగ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి, కొత్తగూడెం ఆర్టీఓ వెంకటరమణ, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, డీఏఓ బాబూరావు పాల్గొన్నారు. అలాగే, రహదారి భద్రతపై జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించగా.. కలెక్టర్, ఎస్పీ పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో గుర్తించాలని, ఈనెల చివరి నాటికి రహదారులపై ఉన్న గుంతలను పూడ్చాలన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత ప్రాణాలు పోకుండా ఆస్పత్రులకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉన్న సమీప రహదారులు, ఆస్పత్రులను ఎంపిక చేయాలని చెప్పారు. రహదారులపై సైన్బోర్డులతో పాటు, రేడియం స్టిక్కర్లు, జీబ్రాలైన్లు, స్టాపేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం రహదారి భద్రతపై రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, డీపీఓ చంద్రమౌళి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
యాంటీ డ్రగ్ కమిటీ సమావేశంలో
కలెక్టర్ జితేశ్ వి.పాటిల్