
‘ఆఫ్టైప్’కు పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు
సత్తుపల్లి/వేంసూరు: ఆయిల్పామ్ సాగుచేయగా, ఆఫ్టైప్ మొక్కలు వచ్చిన రైతులకు పరిహారం చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాల్సి వస్తుందని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ హెచ్చరించారు. సత్తుపల్లి, వేంసూరు దమ్మపేట మండలాల్లోని ఆయిల్పామ్ తోటలు, రేగళ్లపాడులోని నర్సరీని మంగళవారం సంఘం ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం సత్తుపల్లిలో ఏర్పాటుచేసిన సమావేశంలో సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోటలోనే 40 ఆఫ్టైప్ మొక్కలు వచ్చాయని చెప్పారని, తద్వారా ఇంకా ఎందరు రైతులకు ఇలా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. నాలుగేళ్లుగా ఆఫ్టైప్ మొక్కలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఒక్కో రైతు ఎకరాకు రూ.6 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు. రేగళ్లపాడు నర్సరీలో 2.20 లక్షల మొక్కలను తీసివేయకుండా రైతులకు ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం సరికాదన్నారు. ఇకనైనా ఆయిల్ఫెడ్ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించడమే కాక పామాయిల్ మద్దతు ధరను టన్నుకు రూ.25వేలు ఇవ్వాలని సాగర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు బొంతు రాంబాబు, కొక్కెరపాటి పుల్లయ్య, తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, చెలికాని సూరిబాబు, అన్నవరపు సత్యనారాయణ, బాల బుచ్చయ్య, వెంకట్రావ్, మోరంపూడి పాండు, సర్వేశ్వరరావు, రావుల రాజబాబు పాల్గొన్నారు.
రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి తీగల సాగర్