
పూర్వవైభవం వచ్చేనా?
● పాల్వంచ నుంచి తరలిపోతున్న కర్మాగారాలు, కార్యాలయాలు ● అభివృద్ధిపై స్పష్టమైన హామీలేవి..? ● నూతనంగా ఏర్పడిన ఫోరం ఫర్ బెటర్ పాల్వంచ, నూతన విద్యుత్ ఉత్పాదన సాధన కమిటీలు
పాల్వంచ: కొత్తగూడెం కార్పొరేషన్లో ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ అయిన పాల్వంచ విలీనం అయి డివిజన్గా ఏర్పడటంతో పాల్వంచ ప్రతిష్ట తగ్గిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్పొరేషన్ అయితే అనేక పరిశ్రమలు వచ్చే అవకాశంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ప్రభుత్వం, పాలకులు అనేక విధానాలుగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొత్తగూడెం కార్పొరేషన్ లేని సమయంలోనే మండల కేంద్రంగా ఉన్న పాల్వంచలో నవభారత్, ఎన్ఎండీసీ, కేటీపీఎస్ వంటి కర్మాగారాలతో పాటు, కిన్నెరసాని రిజర్వాయర్, పర్యాటక కేంద్రం అభివృద్ధి వంటి అనేక ఉపాధి అవకాశాలకు పుట్టినిల్లుగా ఉండేది. రానురాను పాల్వంచ అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉపాధి అవకాశాలు సన్నగిల్లి వేలాది కుటుంబాలు ఇక్కడి నుంచి తరలిపోతున్నాయి. కార్పొరేషన్లో విలీనమైన నేపథ్యంలో పాల్వంచకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని పాల్వంచ పట్టణ ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు కలిసి ఫోరం ఫర్ బెటర్ పాల్వంచ పేరుతో జేఏసీగా ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా పాల్వంచలో మరో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఉద్యోగ, కార్మిక, ఇంజనీర్స్ సంఘాలు ఏకమై నూతన విద్యుత్ ఉత్పాదక సాధన కమిటీగా ఏర్పడ్డారు.
పాల్వంచ అభివృద్ధికి గొడ్డలి పెట్టు
రాష్ట్రానికి వెలుగులు పంచే కేటీపీఎస్ను 1967 దశకం నుంచి ఇక్కడే ఏర్పాటు చేసి కాలక్రమేణా దశలవారీగా 2,520 మెగావాట్లు అందించే స్థాయికి ఎదిగింది. అంతేగాక ఇనుముకు ముడిసరుకును అందించి నవభారత్ ఫెర్రో ఎల్లాయిస్ కర్మాగారం, స్టీల్ ప్లాంట్ (ఎన్ఎండీసీ), నవభారత్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం వంటి పరిశ్రమలు రూపుదిద్దుకున్నాయి. అంతేగాక కిన్నెరసాని రిజర్వాయర్, పర్యాటక కేంద్రాలు ప్రసిద్దికెక్కాయి. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, క్రీడా పాఠశాలలు వెలిశాయి. ఈ క్రమంలో పాల్వంచ అంటే పారిశ్రామిక కారిడార్గా గుర్తింపు రావడంతో పాటు ఇక్కడ అనేక కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కల్పవృక్షంగా ఉండేది. మండల కేంద్రం కాస్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, పంచాయతీ నుంచి ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. ఐటీడీఏ, ట్రైబల్ కోర్టులు ఇక్కడికే వచ్చాయి. దీంతో సుమారు ఐదారు మండలాల ప్రజలు ఏపని కావాలన్నా ఇక్కడికే వచ్చేవారు. ఇక ఇదంతా పాత మాటగా మారిపోయింది. జిల్లాల పునర్విభజనతో రెవెన్యూ కేంద్రాన్ని కొత్తగూడెంలో కలిపేశారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం, ఇరిగేషన్ ఈఈ, ఏటీడబ్ల్యూఓ కొత్తగూడెంలో కలిశాయి. ఇక ఐటీడీఏ, ట్రైబల్ కోర్టు భద్రాచలానికి మార్చారు. కాలం చెల్లిందని 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని తొలగించారు. నష్టాల ఊబిని తట్టుకోలేక స్పాంజ్ ఐరన్ స్టీల్ ప్లాంట్ను ఎన్ఎండీసీకి అప్పగించగా అప్పటికీ నష్టాలు గట్టెక్కక పోవడంతో మూసివేతకు గురైంది. నవభారత్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సైతం నష్టాల కారణంగా ఉత్పత్తిని నిలిపివేశారు. ఫెర్రోఎల్లాయిస్ సైతం నష్టాలు ఉన్నాయని ప్రొడక్షన్ తగ్గించడంతో పాటు సిబ్బందిని తగ్గించారు. ఈ పరిణామాల కారణంగా కాల క్రమేణా ఇక్కడి ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేటీపీఎస్ మూసివేత కారణంగా వేలాది మంది ఉద్యోగులు బదిలీ వేటుకు బలయ్యారు.
మార్కెట్ కుదేలు
ఇటీవల కాలంలో పాల్వంచ జనాభా 20 వేలకు తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడి ఉద్యోగులు, వారి కుటుంబాలతో సహా వెళ్లిపోవడంతో మార్కెట్ వెలవెలబోతోంది. వర్తక, వాణిజ్యాలు కుదేలయ్యాయి. ఇళ్లు ఖాళీగా ఉండటం, టూలెట్ బోర్డులు కలినిపిస్తున్నాయి. విమానశ్రమం, ఎన్ఎండీసీ విస్తరణ, ఆటోనగర్ ఏర్పాటు ఊసేలేదు. ఇక్కడి వనరుల దృష్ట్యా మరో విద్యుత్ కర్మాగారానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం సుముఖంగా లేదు. అంతేగాక పాల్వంచను కొత్తగూడెం కార్పొరేషన్లో కలిపారు. ఇలాంటి పరిణామాలతో ప్రముఖులు కమిటీగా ఏర్పడ్డారు.
గతంలో హామీ ఇచ్చారు.
పాత ప్లాంట్ కూల్చిన సమయంలో మరో కర్మాగారం ఏర్పాటుకు అధికారులు, పాలకులు హామీ ఇచ్చారు. వనరులు మెండుగా ఉన్న నేపథ్యంలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పవచ్చు. భవితారాల కోసం ఆందోళనలకు సిద్ధం కావాలి.
–జమ్ముల సీతారామిరెడ్డి, నూతన విద్యుత్
ఉత్పాదక కేంద్రం సాధన కమిటీ సభ్యులు
పాల్వంచ బ్రాండ్ను పెంచాలి..
పాల్వంచను కార్పొ రేషన్లో కలిపే క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. పాల్వంచ బ్రాండ్ను పెంచే విధంగా కృషి చేయాలి. రైల్వేలైన్కు అనుకూలంగా ఉన్న కరకవాగును పరిగణనలోకి తీసుకోవాలి. ఎయిర్పోర్ట్పై మరో సర్వే చేయాలి. అనేక సంస్థలను ఇక్కడే ఏర్పాటు చేసేలా హామీ ఇవ్వాలి.
–నూకల రంగారావు, ఫోరం ఫర్ బెటర్
పాల్వంచ వ్యవస్థాపక సభ్యులు

పూర్వవైభవం వచ్చేనా?

పూర్వవైభవం వచ్చేనా?