
అలరించిన ‘అనశ్వరం’
ఖమ్మంగాంధీచౌక్: నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో విజయవాడలోని శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్కు చెందిన కళాకారులు ప్రదర్శించిన ‘అనశ్వరం’నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమాజ మార్పు అంశంగా బర్రె సత్యనారాయణ రచించిన ఈ నాటికకు ద్వాదశి వెంకటచంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. వైద్య వృత్తితో వ్యాధులు నయం చేయటమే గాకుండా సమాజంలో ఆత్మహత్యలు జరగకుండా చైతన్యం కలిగించేందుకు కూడా తమ వృత్తి ఉండాలని వైద్యుల తపనపై, అనాగరికులను నాగరికులుగా మార్చటం, అనాథలకు అండగా నిలిచి, వారి అభ్యున్నతికి పాల్పడటం లక్ష్యంగా రూపొందించిన నాటిక ప్రేక్షకులను ఆలోచించపజేసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో కార్పొరేటర్ కమర్తపు మురళి, కార్యక్రమ అతిథి బత్తినేని నీరజ మాట్లాడుతూ.. ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో నెలనెలా వెన్నెల పేరిట నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. నిర్వాహకులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి ప్రతి నెలా కార్యక్రమాన్ని నిర్వహించటం ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో అమరజీవి అనాబత్తుల రవీంద్రనాథ్ సాంస్కృతిక కళా సంస్థ(ఆర్క్స్) కార్యదర్శి అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, ఖమ్మం కళా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగబత్తిని రవి, ప్రజానాట్యమండలి కార్యదర్శి వేముల సదానందం, నందిగామ కృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గాయకులు మంజులనాయుడు, గణపతి రాజు, భిక్షం తదితరులు సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఫాదర్స్ డే సందర్భంగా నాన్న ఔన్నత్యం తెలిపే పాటలు పాడారు.