
‘భూభారతి’తో రైతులకు మేలు
ఇల్లెందురూరల్/టేకులపల్లి: భూభారతి చట్టం భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైతులకు మేలు చేస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో, టేకులపల్లి తహసీల్లో ఆదివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. బేతంపూడి సొసైటీ ఆధ్వర్యంలో టేకులపల్లి వ్యవసాయ మార్కెట్ సబ్యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలు ఉన్న రైతులు ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామా సమస్యలు నిర్దిష్ట గడువులోగా పరిష్కారమవుతాయని తెలిపారు. అన్యాయం జరిగినట్లు భావిస్తే బాధితులు ఆర్డీఓ, కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఆర్థికస్తోమత లేని రైతులకు ఉచితంగా న్యాయ సహాయం కూడా అందుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. గతంలో ధరణి పోర్టల్ను ప్రైవేటు సంస్థ నిర్వహించడం వల్ల అనేక తప్పిదాలకు అవకాశం ఏర్పడిందని, కానీ ఽభూభారతి పోర్టల్ను ప్రభుత్వమే నిర్వహిస్తుందని, తప్పిదాలకు అవకాశం ఉండదని అన్నారు. రైతులు ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర, బోనస్ పొందాలని సూచించారు. అనంతరం పలువురు రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొత్త సొసైటీలకు స్థలాలు కేటాయించాలని కలెక్టర్కు చైర్మన్ విన్నవించారు.
ధరణితో చాలా నష్టపోయారు..
తప్పుల తడకగా ఉన్న ధరణితో పోర్టల్తో రైతులు చాలా నష్టపోయారని, భూభారతి చట్టం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కాస్తుదారు కాలమ్ తొలగించడంతో అనేక మంది రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. పీహెచ్సీ సిబ్బంది వైద్య శిబిరం నెలకొల్పారు. కాగా ఇల్లెందులో ఆదివాసీ చట్టాలకు సంబంధించి ఓ న్యాయవాది సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే విషయమై సదస్సు అనంతరం ఘర్షణకు దారి తీయడంతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఆర్డీఓ మధు, ఏడీఏ లాల్చంద్, తహసీల్దార్లు రవికుమార్, నాగభవాని, ఎంపీడీవోలు ధన్సింగ్, రవీంద్రరావు, ఏఓలు సతీష్, అన్నపూర్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటరాజశేఖర్రెడ్డి, సొసైటీ సీఈఓ పి.ప్రేమాచారి, నాయకులు భూక్య దళ్సింగ్నాయక్, చరణ్, పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, కోరం సురేందర్, కె.వెంకట్, శివలాల్, బి.బాలాజీ, శ్యాం, ఉదయ్ పాల్గొన్నారు.
వివాదాలకు ఇక శాశ్వత పరిష్కారం
పేద రైతులకు ఉచిత న్యాయసహాయం
అవగాహన సదస్సులో కలెక్టర్ జితేష్

‘భూభారతి’తో రైతులకు మేలు