చీరాల అర్బన్: చేనేత కార్మికులకు సంబంధించి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం.. అర్హుల జాబితాలో పేరు లేనివారు హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయం ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్శాఖ ఈఈ జాన్ థామస్ తెలిపారు. మగ్గం ఉన్న వారికి 200 యూనిట్లు, పవర్లూమ్ వారికి 500 యూనిట్లు ఉచితం అని ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులపై ‘నేతన్నకు గుండె గు‘బిల్లు’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. చేనేత ఉపవృత్తుల వారికి పథకం వర్తించదని ఈఈ స్పష్టం చేశారు. ఉపవృత్తుల వారికి కూడా మగ్గం ఉన్న చేనేత కార్మికులకు వర్తించే పథకాలు వర్తిస్తాయని తమకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గైడ్లైన్స్ లేవని తెలిపారు. ఈ క్రమంలో ఉచిత విద్యుత్కు సంబంధించి అర్హుల జాబితాలో పేరు లేనివారు మళ్లీ హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయం ద్వారా తమకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పునఃపరిశీలించి అర్హులకు ఇబ్బంది లేకుండా పథకం వర్తింప చేస్తామన్నారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి 200 యూనిట్లు కన్నా అదనంగా వినియోగించినా మొత్తం యూనిట్లలో 200 యూనిట్లు పోను మిగిలిన యూనిట్లకు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. అయితే శ్లాబు ప్రకారం మిగిలిన యూనిట్లకు ధర చెల్లించాల్సి ఉంటున్నారు. కాగా రూ.399 విద్యుత్ బిల్లు వచ్చిన ఓ చేనేత కార్మికుడి నుంచి ఆ మొత్తం కట్టించుకున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ విషయన్ని ఈఈ దృష్టికి తీసుకెళ్లగా తమ జాబితాలో ఉన్నవారికి అలా జరిగితే పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. ఎవరన్నా అద్దె ఇళ్లలో ఉంటే ఆ గృహ యమజాని నుంచి అనుమతి పత్రం పొంది దాఖలు చేయాలని చెప్పారు.
విద్యుత్ శాఖ ఈఈ జాన్ థామస్


