తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక గ్రామం టిడ్కో గృహ సముదాయంలో నివాసముండే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం ఉండవల్లి సెంటర్కు చెందిన త్రివేణి (23) కి దుగ్గిరాల మండలం మంచికలపూడికి చెందిన రవికుమార్కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల పాప ఉంది. ఐదు సంవత్సరాల క్రితం త్రివేణి భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి కొంతకాలం ఉండవల్లి సెంటర్లోని తల్లి ఇంటి వద్ద నివాసముండి ప్రస్తుతం పెనుమాకలో టిడ్కో హౌస్లో నివాసముంటూ హైకోర్టు వద్ద జిరాక్స్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో జూనియర్ లాయర్గా పనిచేస్తున్న విక్కీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో విక్కీ మరో యువతిని ప్రేమిస్తున్నాడని త్రివేణి అనుమానం పెంచుకుంది. విక్కీ తనతో మాట్లాడకపోవడంతో మనస్తాపం చెందిన త్రివేణి ఆమె నివాసముండే ప్లాట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన సంఘటనపై తల్లి రాజకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరేంద్ర తెలిపారు.


