తుక్కుతుక్కుగా కాలం చెల్లిన వాహనాలు
తుక్కుతుక్కుగా కాలం చెల్లిన వాహనాలు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు రూరల్ మండలం బుడంపాడు పరిసర ప్రాంతాల్లో 2023లో హిందూస్తాన్ రీసైక్లింగ్ స్క్రాప్ హబ్ను ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, అన్ని అనుమతులు తీసుకుని రీ సైక్లింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో డీటీసీగా పనిచేసిన షేక్ కరీంతో పాటు ఒంగోలు డీటీసీలు, జేటీసీలు పూర్తిస్థాయిలో అన్ని పర్యవేక్షించిన అనంతరం అనుమతులు జారీ చేశారు. తొలుత వాహనాలు పెద్దగా రాకపోయినా ఇప్పుడు గణనీయంగా మార్పు వచ్చింది. ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు 709 ప్రభుత్వ ద్విచక్ర వాహనాలు, 15 డిఫెన్స్, పూర్తిగా పక్కన పడేసినవి 1,588, ప్రైవేట్ బైక్లు 53 ధ్వంసం చేశారు. ప్రభుత్వానికి చెందిన కార్లు, నాలుగు చక్రాల వాహనాలు, లారీలు 1,248, పూర్తిగా పక్కన పడేసినవి 28, డిఫెన్స్ వాహనాలు 26, ప్రైవేట్వి 83 వాహనాలను ఇప్పటికి తుక్కు చేశారు.
పాత వాహనాలను స్వచ్ఛందంగా, అధికారికంగా స్క్రాప్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 2021లో జీవో 653 (ఈ)ను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 15 సంవత్సరాలు కాలం చెల్లిన ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు, ప్రమాదాల్లో పూర్తిస్థాయిలో దెబ్బతిన్నవి, వాహనదారులు వినియోగించకుండా పక్కన పడేసిన వాటితో పాటు ప్రభుత్వ, స్థానిక సంస్థల, కార్పొరేషన్లు, ఆర్టీసీ బస్సులను సైతం స్క్రాప్ పంపాల్సిందేనని స్పష్టం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం నుంచి అనుమతుల అనంతరం పూర్తిస్థాయిలో బుడంపాడు పరిసర ప్రాంతంలో మూడు ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో రూ. 2.50 కోట్లతో నిర్వాహకులు రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. సాంకేతికంగా, మ్యాన్యువల్గా సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. హబ్కు వాహనాన్ని పంపి స్క్రాప్ చేయించటం ద్వారా ప్రభుత్వ పత్రం అందజేయడంతో పాటు మార్కెట్ ధర ప్రకారం ఇంజిన్, ఇతర సామగ్రికి వెలకట్టి వాహనదారుడికి అందజేస్తారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలో 20 నుంచి 25 శాతం వరకు రాయితీ పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీతో పాటు ఉచిత ఉచిత రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ అండ్ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్వీఎస్ఎఫ్) ద్వారా పూర్తిస్థాయిలో వెహికల్ సమాచారాన్ని అందజేస్తారు. తొలి రోజుల్లో పెద్దగా సంస్థపై అవగాహన లేకపోయినప్పటికీ, ఇప్పుడు అధిక సంఖ్యలో వాహనాలు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. స్క్రాప్ అనంతరం పొందే సర్టిఫికెట్కు మూడు సంవత్సరాల పాటు కాల పరిమితి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం రీసైక్లింగ్ యూనిట్ ద్వారా స్క్రాప్కు చేయించుకున్న వాహనాలకు సంబంధించి 20 నుంచి 25 శాతం వరకు నూతన వాహనాల కొనుగోలులో రాయితీ ఇచ్చే ప్రక్రియను తీసుకుని వచ్చింది. ఇదే వ్యవస్థలు పలు రాష్ట్రాల్లో కొనసాగడంతో వాహనదారులకు రాయితీలు అందుతున్నాయి. అయితే, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన, జీవోని జారీ చేయని పరిస్థితుల్లో వాహనదారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్క్రాప్ తరువాత రీస్లైక్లింగ్ యూనిట్ నుంచి వచ్చే ధ్రువపత్రం కాలపరిమితి మూడేళ్లు కావటం, ఈలోగా పరిమితి ముగిస్తే, రాయితీ అందనే భావనలో ఉన్నారు. సంస్థ నిర్వాహకులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని చెబుతున్నారు.
నిబంధనలకు అనుగుణంగానే స్క్రాపింగ్
సరికొత్త మినషరీ, వ్యవస్థ
రీసైక్లింగ్ హబ్ ద్వారా వాహనాన్ని తుక్కు చేయడానికి అనేక రకాల పరికరాలను అందుబాటులోకి నిర్వాహకులు తీసుకు వచ్చారు. డీ పొల్యూషన్, ఆయిల్ పొల్యూషన్ పంప్స్, స్క్రాప్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ముందుగా కాలం తీరిన వాహనం వెళ్లిన తరువాత పార్ట్లు విభజిస్తారు. ముఖ్యంగా దీనిలో అత్యంత ముఖ్యమైనది డీ రిస్కింగ్, బెల్డ్ డిటెన్సనర్, ఎయిర్ బ్యాగ్ డిఫ్లయిర్స్, హీల్ పాపర్స్ వంటి పనులను డీ రిస్కింగ్ ద్వారా చేస్తారు. అనంతరం డీ మ్యాండ్లింగ్ ద్వారా కంప్రెసర్ ఎయిర్, షేల్సే వంటి పనులు చేసి ఆఖరికి రీసైక్లింగ్కు పంపుతారు. స్క్రాప్ బైయింగ్ మిషన్ ద్వారా ఇనుప సామగ్రిని తుక్కుతుక్కు చేసేస్తారు. కచ్చితంగా వాహనానికి రిజిస్ట్రేషన్ ఉంటే మాత్రమే స్క్రాప్కు అనుమతినిస్తారు.
● 15ఏళ్లు దాటితే రీసైక్లింగ్ తప్పనిసరి
● దక్షిణ భారతదేశంలో తొలిసారిగా
గుంటూరులో యూనిట్ ఏర్పాటు
● స్క్రాప్ చేయించుకున్న వారికి
20 నుంచి 25శాతం వరకు
రాయితీ ప్రకటన
● ఇప్పటికీ అమలు కానీ పరిస్థితి
● త్వరలో వచ్చే అవకాశాలున్నాయని
చెబుతున్న నిర్వాహకులు
కేంద్ర ప్రభుత్వం జీవో జారీ
స్క్రాప్ తర్వాత ప్రభుత్వ పత్రం
కేంద్రం ఇచ్చినా.. స్పందించని రాష్ట్రం