పరిష్కార వేదికకు అర్జీల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పరిష్కార వేదికకు అర్జీల వెల్లువ

Mar 25 2025 2:11 AM | Updated on Mar 25 2025 2:07 AM

170 అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌
నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు

బాపట్లటౌన్‌: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకోవాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. జిల్లా నలుమూలల నుంచి సోమవారం 170 మంది అర్జీదారులు కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందజేశారు.

చిన్నారావు చెరలు భరించలేకపోతున్నాం

నగరం మండలం సిరిపూడి ఎస్సీ కాలనీకి చెందిన గొర్రుముచ్చు చిన్నారావు పెడుతున్న చెరలు మేము భరించలేకపోతున్నాం. చుట్టుప్రక్కల గ్రామాల్లోని అమాయకులైన రైతుల పొలాలను కొందరు నాయకులు, అధికారుల అండతో కబ్జా చేస్తున్నాడు. గతంలో చందోలు సంతబజార్‌, మట్లపూడి ఎస్సీకాలనీ, పెదమట్లపూడి గ్రామాల్లోని కొందరు రైతులను బెదిరించి వారి వద్ద కొంత నగదు తీసుకున్నాడు. ప్రస్తుతం జి.ఎన్‌.పాలెం గ్రామానికి చెందిన సమ్మెట మంగమ్మకు చెందిన ఆస్తిపై కన్నేసి ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలి.

– జి.ఎన్‌.పాలెం రైతుల అవేదన

సంపద సరే... సరుకులేవి బాబుగారూ

మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికలకు ముందు ప్రచారాలు ఊదరకొట్టారు. సీఎం అయిన తర్వాత పేదలకు పంపిణీ చేసే నిత్యావసర సరుకుల్లోనే కోతలు విధించారు. సంపద సంగతి దేవుడెరుగు కనీసం పేదలకు రేషన్‌దుకాణాల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు పంపిణీ చేయండి, కందిపప్పు సరఫరా లేకపోవడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఒక్కదానిని కూడా పూర్తిస్థాయిలో అమలుచేసిన దాఖలాలు లేవు.

– జై భీమ్‌రావు భారత్‌పార్టీ నాయకులు

చీరాల: మున్సిపాలిటిలో వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా చీరాల మున్సిపల్‌ కమిషనర్‌ తొలగించారు. తిరిగి ఉద్యోగం కల్పించి ఉపాధి కల్పించాలి. చీరాల మున్సిపల్‌ ఆప్కాస్‌ ఉద్యోగులు సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఆప్కాస్‌లో ఉన్న ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని, అదేమిటని కమిషనర్‌ని అడిగితే జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తొలగించామని చెప్పారన్నారు. అలానే విధులకు హాజరవుతున్నప్పటికి జీతాలు ఇవ్వకుండా కమిషనర్‌ ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఆప్కాస్‌ నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకొని ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో ఆప్కాస్‌ ఉద్యోగులు దాసరి మణికంఠ, కె.విజయలక్ష్మి, జ్యోతుల డేవిడ్‌, జాన్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు రక్షణలేదు

నా ఇంటికి ఎదురుగా డాక్టర్‌కి చెందిన స్థలం ఉంది. ఆ స్థలంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మునిపల్లి సుబ్బయ్య కార్లు పార్కింగ్‌ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్‌ వచ్చి ఖాళీ చేయించారు. దీనికి మేమే కారణమని మనస్సులో పెట్టుకొని నిత్యం నన్ను దుర్భాషలాడటంతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరి 17న దాడి కూడా చేశాడు. ఈ విషయంపై రేపల్లె పోలీసులకు, ఎస్పీకి పలుమార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దివ్యాంగుడినైన నేను 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి నాలుగుసార్లు తిరిగినా కనికరం చూపడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నాపై దాడిచేసిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.

– షేక్‌ సుభానీ,దివ్యాంగుడు, రేపల్లె

పరిష్కార వేదికకు అర్జీల వెల్లువ1
1/2

పరిష్కార వేదికకు అర్జీల వెల్లువ

పరిష్కార వేదికకు అర్జీల వెల్లువ2
2/2

పరిష్కార వేదికకు అర్జీల వెల్లువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement