మరో నలుగురికి గాయాలు
జె.పంగులూరు: కూలీల ఆటో జాతీయ రహదారిపై దిమ్మెను ఢీకొని బోల్తా పడిన ప్రమాదంలో ముప్పవరం గ్రామానికి చెందిన కూలీ మేసీ్త్ర షేక్ అషీర్ బీ (60) అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మండల పరిధిలోని అలవలపాడు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రతి రోజు ముప్పవరం నుంచి మిరపకాయలు కోసేందుకు కూలీలు రావినూతల గ్రామం వెళుతుంటారు. బుధవారం ఆటోలో పది మంది బయలు దేరారు. కొండమంజులూరు గ్రామానికి చెందిన సందోలు ఇమ్మానియేలు ఆటో నడిపాడు. జాతీయ రహదారిపై అలవలపాడు అడ్డరోడ్డు దగ్గరకు వచ్చేసరికి రోడ్డుకు అడ్డంగా సిమెంట్ దిమ్మె ఉంది. గత రాత్రి ఒక లారీ సిమెంట్ దిమ్మెను గుద్దటంతో అది రోడ్డు మధ్యలో వచ్చి పడింది. ఆటో డ్రైవర్ అది గమనించకపోవడంతో నేరుగా వెళ్లి దిమ్మను ఢీ కొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కూలీలను పనికి తీసుకెళ్లే మేసీ్త్రషేక్ అషిర్ బీ అక్కడిక్కడే మృతి చెందింది. ఆటోలో ఉన్న దాసరి పుష్పాలు, కొమ్ము పాపమ్మ, చింతల లక్ష్మి, వలపర్ల భారతీలకు గాయాలు అయ్యాయి. హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను మార్టురు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆటో డ్రైవర్ ఇమ్మానియేలుకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో గుంటూరు వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై వినోద్బాబు తెలిపారు. రేణింగవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.