సమస్యలతో పోరాడుతున్న హృదయాలు అధికారుల కరుణ కోసం నిరంతరం శ్రమిస్తూ ఓడిపోతున్నాయి. వేదనాభరితమై రగిలిపోతున్నాయి. అయినా కర్కశ యంత్రాంగం దయ చూపడం లేదు. నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. గుండె గోడు పట్టించుకోవడం లేదు. పైగా సమస్య పరిష్కారమైపోయినట్టు మాత్రం రికార్డుల్లో నమోదు చేసుకుంటోంది. ఫలితంగా పేదలు సతమతమవుతున్నారు. మళ్లీ అర్జీలు చేతబట్టి వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్నారు. ఈ ని‘వేదనల’ పర్వానికి ముగింపు పలికేదెప్పుడో సర్కారే చెప్పాలి.
వీఆర్వోనే కబ్జా చేశాడు
నాకు ఖాతా 70 సెంట్ల భూమి ఉంది. ఆ భూమిని నేను 2006లో తేళ్ళ సువార్తమ్మ దగ్గర కొనుగోలుచేశాను. నా పేరుతో అడంగల్, 1బీ ఉన్నాయి. ఇటీవల నా పొలంలో నుంచి 10 సెంట్లు భూమిని మార్టూరు మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న తేళ్ల అంజయ్య తన పేరుతో ఆన్లైన్ చేసుకున్నాడు. న్యాయం కోసం తహసీల్దార్, కలెక్టరేట్ చుట్టూ ఆరునెలలుగా తిరుగుతున్నా.. ఇప్పటికీ ఫలితం లేదు. వచ్చిన ప్రతిసారి రూ.1,000 ఖర్చు అవుతుంది. సమస్యమాత్రం పరిష్కారం కావడం లేదు.
– రామమూరి ప్రభాకరరావు, కొరిశపాడు
బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) అధికారులంతా ఒక్కచోట ఉండే వేదిక. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కరించే అద్భుత కార్యక్రమం. ప్రతి సోమవారం కలెక్టరేట్, పోలీసు జిల్లా కార్యాలయాలతోపాటు డివిజన్, మండల స్థాయి కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. గత ప్రభుత్వ పాలనలో స్పందన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. వచ్చిన ప్రతి అర్జీ పరిష్కారానికి అప్పటి సర్కారు చిత్తశుద్ధితో కృషి చేసింది. ఒక వేళ ఆ అర్జీ పరిష్కరించదగినది కాకపోతే బాధితులకు అర్థమయ్యేలా వివరించి.. మానవతా దృక్పథంతో వారికి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో న్యాయం చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఫలితాలు రాబట్టింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రీవెన్స్ అభాసుపాలవుతోంది. సమస్యలు పరిష్కారం కావడం లేదని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అయినా అధికారులు సమస్యలు పరిష్కారమైనట్టు సందేశాలు పంపిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోక ఆవేదన చెందుతున్నారు.
మాటలతో పరిష్కారమైనట్టేనా..!
వాస్తవానికి ఒక అర్హత కలిగిన వ్యక్తి పెన్షన్ కోసం అర్జీ పెట్టుకుంటే.. ఆ పింఛన్ నగదు అతని చేతికి అందినప్పుడే ఆ సమస్య పరిష్కారమైనట్టు.. అయితే అధికారులు వింత పోకడలు పోతున్నారు. పెన్షన్ త్వరలో మంజూరు చేస్తామని సమాధానం ఇచ్చి ఆ అర్జీ పరిష్కారమైనట్టు చూపిస్తున్నారు. అలాగే రోడ్డు కోసం అర్జీ వస్తే నిధులు రాగానే పూర్తిచేస్తామని చెప్పి అర్జీని క్లోజ్ చేస్తున్నారు. ఇలా సమాధానాలతో సమస్యలు పరిష్కారమైనట్టేనా అని అడిగితే అధికారుల వద్ద జవాబు లేదు.
అవినీతి తాండవం
ముఖ్యంగా రెవెన్యూ అర్జీల విషయంలో అవినీతి పెచ్చుమీరిందనే వాదన అర్జీదారుల నుంచి వ్యక్తమవుతోంది. ఉదాహరణకు భూముల సంబంధిత అంశాలపై అధికారుల వద్దకు వెళితే సర్వేయర్లు, వీఆర్వోలు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. లేకుంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని పెడసరిగా సమాధానం చెబుతున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినా.. మళ్లీ కిందిస్థాయి సిబ్బంది వద్దకు రావాల్సిందే.. అప్పుడైనా ముట్టజెప్పాల్సిందేనని అర్జీదారులు చెబుతున్నారు.
వేలల్లో అర్జీలు.. పదుల్లో పరిష్కారం సాకులు చూపి తప్పుకుంటున్న అధికారులు పరిష్కారం కాకున్నా ఫోన్లకు క్లియరెన్స్ సమాచారం మెసెజ్లు చూసి నివ్వెరపోతున్న బాధితులు నెలల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
అ‘పరిష్కార వేదిక’
అ‘పరిష్కార వేదిక’
అ‘పరిష్కార వేదిక’