● పర్యటనపై స్థానిక నేతలతో చర్చించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
● బండలాగుడు పోటీల ప్రాంతం పరిశీలన
వేముల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24న వేముల మండలం భూమయ్య గారి పల్లెలో పర్యటించనున్నారు. గ్రామంలో రూ. 1.50 కోట్లతో నూతనంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మించారు.ఈ ఆలయంలో 23 నుంచి విగ్రహప్రతిష్ట వేడుకలు జరుగనున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి 24న జరిగే కార్యమానికి హజరుకానున్నారు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె వెంకటబయపురెడ్డి, మండల పరీశీలకులు లింగాల రామలింగారెడ్డితో కలిసి పర్యటన ఏర్పాట్ల ను పరిశీలించారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించారు. వైఎస్ జగన్ రాక సందర్భంగా జనాలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. వైఎస్ జగన్ ఆలయానికి చేరుకున్న వెంటనే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆలయంలో జరిగే అభిషేకం, ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అక్కడ నుంచి బండలాగుడు పోటీలు నిర్వహించే ప్రాంతానికి చేరుకుని పోటీలను ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే లక్ష్మీనరసింహస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట వేడుకులకు ఎంత మంది హజరవుతారనే విషయాలపై నేతలతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చర్చించారు.10 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జెడ్పీటీసీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా వెంకటనారాయణ, చందా మలిరెడ్డి, విష్ణు వర్ధన్రెడ్డి, రాజారెడ్డి, రామచంద్రారెడ్డి, మధుసూదన్రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.


