చిన్నమండెం : మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ శ్రీనివాసపురం రిజర్వాయర్ పాత వట్టంవాండ్లపల్లెకు చెందిన రాపూరి ఆనంద్కు చెందిన ఆవు అడవి జంతువు దాడి చేయడంతో మృతిచెందినట్లు బాధిత రైతు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఆవును అడవి జంతువు కొరికేయడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పశువైద్యాధకారి గణేష్, ఫారెస్ట్ ఎఫ్ఎస్ఓ భరణికుమార్, రఘుపతిరాజు, ఎఫ్బీఓ రెడ్డప్పలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన ఆవును పరిశీలించారు. రైతు రాపూరి ఆనంద్కు 4 పెద్ద ఆవులు, 4 చిన్న ఆవులు ఉన్నాయి. మృతిచెందిన ఆవు విలువ రూ.1.10 లక్షలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.
పట్టపగలే చోరీ
చిన్నమండెం : మండల పరిధిలోని కేశాపురం గ్రామం దేవళంపేటలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. టీచర్ రెడ్డప్ప ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుని కథనం మేరకు తన భార్య మధ్యా హ్నం ఇంటికి తాళం వేయకుండా పక్కనే ఉన్న అమ్మగారి ఇంటికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులోని 50 గ్రాముల బంగారు, రూ.50 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు. ఈ విషయమై చిన్నమండెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు.
లారీ ఢీకొని టమాటా రైతు మృతి
కలికిరి : కలికిరి టమాటా మార్కెట్ యార్డులో చోటు చేసుకున్న ట్రాక్టరు ప్రమాదంలో రైతు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు...సోమల మండలం తమ్మినాయునిపల్లి గ్రామం పేగలవారిపల్లికి చెందిన మల్లికార్జున(30) టమాటాలను డ్రైవర్ గౌతమ్ సాయంతో తన ట్రాక్టరులో బుధవారం ఉదయం 4 గంటలకు కలికిరి వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చాడు. టమాటాలను అన్లోడ్ చేయడానికి ట్రాక్టరును రివర్స్ చేస్తుండగా వెనుకవైపునున్న లారీని ఢీకొంది. ట్రాక్టరు, లారీ మధ్యలో ఇరుక్కోవడంతో రైతు మల్లికార్జునకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తోటి రైతులు, వ్యాపారులు గాయపడ్డ మల్లికార్జున కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. గాయపడిని వ్యక్తిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లికార్జున మృతి చెందాడు. మృతుని తండ్రి చంద్రయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


