రొంపిచెర్ల: మా భూములను రెవెన్యూ అధికారులు అన్లైన్లో మార్చేశారని, మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ ముంతావారిపల్లెకు చెందిన బాధితురాలు జి. హైమావతి అన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మా మామ చెంచయ్యకు సర్వే నంబర్ 2972–1లో 1.38 సెంట్లు, 2973–3బి1లో 95 సెంట్ల భూమి ఉందన్నారు. అయితే మా మామకు నలుగురు కుమారులని, వీరిలో ముగ్గురు మృతి చెందారని, మూడో కుమారుడు వెంకటరమణ మాత్రమే జీవించి ఉన్నారని తెలిపారు. నా భర్త సుధాకర్ కూడా మృతి చెందారని చెప్పారు. దీంతో తన బావ వెంకటరమణతో కలిసి మా మామ పేరుతో ఉన్న ఆస్థిని మా పేరుతో పట్టాదారు పాసు పుస్తకం మార్పు కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. అయితే అ భూమిని గ్రామానికి చెందిన వి.వెంకటరమణ, కుమారి ఇద్దరు 2023లో వారి పేర్లతో అన్లైన్ చేసుకున్నారని ఆరోపించారు. 20 సంవత్సరాల వయస్సు గల 70 మామిడి చెట్లు కూడా ఉన్నాయని చెప్పారు. భూమి ఆన్లైన్లో మార్చేసిన విషయం గురించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే రొంపిచెర్ల తహసీల్దార్ కలెక్టర్కు పంపిన నివేదికలో భూమి మా ఆధీనంలో ఉన్నట్లుగాని, మామిడి చెట్లు, సమాధులు ఉన్నట్లుగాని కనపరచలేదన్నారు. ఈ ఏడాది మామిడి పంట ద్వారా రూ.15 వేలు ఆదాయం కూడా వచ్చిందన్నారు. రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా కలెక్టర్కు నివేదిక పంపారని ఆరోపించారు. దీనిపై సమగ్రమంగా విచారణ జరిపి న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని తెలిపారు.
న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం
బాధితురాలు హైమావతి


