● అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఒరిగింది శూన్యం
● మోసపూరిత హామీలపై
వైఎస్సార్ సీపీ యుద్ధభేరి
● నేడు వెన్నుపోటుకు రెండేళ్ల పాలనపై భారీ ర్యాలీలు
సాక్షి అన్నమయ్య : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పేదల్లో అర్హులైన వారు ఎంతోమంది ఉన్నా సంక్షేమ ఫలాలకు దూరమవుతున్నారు. అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో హామీలిచ్చి..ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ప్రజలు ఆశలు అడియాసలయ్యాయి. చివరకు సూపర్సిక్స్ లాంటి పథకాలు ప్రకటించి ఇప్పటికీ సక్రమంగా అమలు చేయకుండా కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి లేదు....ఉపాధి బాట లేదు..మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి ఏర్పాటు చేస్తామన్నా ఇప్పటికీ అతి గతీ లేదు. కళ్లెదుటే బాబు సర్కార్ మోసాలు, ఎత్తుగడలు, ఇంటింటి ప్రచారాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సిద్ధమైంది.
బాబు వెన్నుపోట్లతో దగాపడిన ప్రజలు
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రజలను వంచనకు గురిచేస్తూ వస్తోంది.ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా సంక్షేమ పథకాలు అమలు కాలేదు. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ ఇస్తున్నారు. అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ ఇలా పేరు ఏదైనా అనేక మంది అర్హులుగా ఉన్నా అందని పరిస్థితులు నెలకొన్నాయి.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
సాగుతున్న నిరసనలు
రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ అనేక స్కామ్లతో ముందుకు వెళుతుండడం, సంక్షేమ పథకరాలను ప్రజలకు అందించడంలో విఫలం కావడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు యుద్ధభేరి మోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 4వ తేదీన ఎక్కడికక్కడ టీడీపీ మ్యానిఫెస్టో ప్రతులను ప్రధాన కూడళ్లలో దహనం చేసి నిరసన తెలియజేశారు. అనంతరం రెండు రోజులుగా ఎక్కడికక్కడ నల్లబెలూన్లు ఎగరవేయడం, కూటమి వంచనపై నల్లకండువాలు వేసుకుని సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇలా వరుసపెట్టి కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
నేడు నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు
జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు.జిల్లా కేంద్రమైన మదనపల్లెతోపాటు రాయచోటి, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన గళం వినిపించనున్నారు.


