పెండింగ్లోని కూలీల సొమ్ము
● ఉపాధి కూలీలకు
నెలల తరబడి అందని వేతనాలు
● జిల్లాలో రూ.21 కోట్లు పెండింగ్
● ప్రత్యామ్నాయ పనులవైపు
దృష్టిసారించిన కూలీలు
● ఉపాధి పథకంపై నీలి నీడలు
మదనపల్లె: ఉపాధి హామీ పథకానికి గ్రహణం పట్టింది. ఒకప్పుడు వేల మంది కూలీలతో కళకళలాడిన ఈ పథకం నేడు వందలాదిమందితోనే నెట్టుకొస్తోంది. తమకు పనులు చూపించండని అధికారులను వేడుకున్న దశ నుంచి.. ‘రా..రమ్మని’ పిలుస్తున్నా రాని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం కూలి డబ్బులు సరిగా చెల్లించకపోవడమే. ‘చెమడోచ్చి పనులు చేస్తున్నా సమయానికి వేతనం ఇవ్వకుంటే పనులు ఎలా చేసేది సారూ’ అంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అప్పుల ఉపాధి మాకొద్దం’టూ ముఖాన్నే చెబుతున్నారు.
25వేలకు పడిపోయిన కూలీలు
జిల్లాలో 1.41 లక్షల జాబ్కార్డులు ఉండగా కూలీకి వస్తున్న వారిసంఖ్య భారీగా తగ్గిపోతోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 25,570 మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు హాజరయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య తక్కువే. ఈరోజు జరిగిన ఉపాధి కూలి పనుల్లో జిల్లాలోని రామాపురం మండలంలో 2,657 ఉంది కూలీలు పనికి వచ్చారు. జిల్లాలో అత్యధిక కూలీల సంఖ్య నమోదయింది ఇక్కడే. ఆ తర్వాత లక్కిరెడ్డిపల్లిలో 2,416, గాలివీడులో 2,347, సంబేపల్లిలో 2,185, రాయచోటిలో 1,697, చిన్నమండెంలో 1,993, ములకలచెరువులో 1,601, తంబళ్లపల్లెలో 1,050 మంది ఉపాధి కూలీలు పనులకు హాజరు నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కూలీల పనుల్లో రామాపురం మండలం మొదటి స్థానంలో ఉంది. మదనపల్లె, నిమ్మనపల్లె, సదుం, కంభంవారిపల్లె, చౌడేపల్లె మండలాల్లో తక్కువ మంది కూలీలు పనులకు వచ్చారు.
రూ.21 కోట్లు పెండింగ్
ఉపాధి హామీ పథకం పనులకు వచ్చేవారంతా పూట గడవని కూలీలే. పని చేస్తే గాని కడుపు నిండదు. ఉపాధి హామీ పథకం పనులు నమ్ముకుని వేల సంఖ్యలో కూలీలు ఉన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పనులకు వస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా వేతనాలు పెండింగ్లో పెట్టడంతో పూట గడవడం కష్టమైంది. జిల్లాలోని 25 మండలాల వారికి రూ.20,91,36,111 కూలీ సొమ్ము పెండింగ్లో ఉంది. ఈ సొమ్ము ప్రతివారం కూలీల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 12 నుంచి ఈరోజు వరకు కూలీల సొమ్ము జమ కాలేదు. దాంతో కూలీలు ఇల్లు గడవడం కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరు కూలీలు చేసేదిలేక ఇతర పనులకు వెళ్తున్నారు. టమాట కూలీ పనులకు, పోలం పనులు లాంటి పనికి వెళ్తే కూలీ సొమ్ము ఆరోజే అందుతుంది, దాంతోపాటు శ్రమ కూడా తక్కువ. ఎక్కువసేపు ఎండలో ఉండి పని చేయాల్సిన అవసరం లేదు. దాంతో కూలీలు ఎక్కువగా ఉపాధి హామీ పనులకంటే ఇతర పనులు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూలీలకు వేతనాల పంట పండింది. ఏ రోజు ఇబ్బంది లేకుండా వేతనాలు చెల్లించడంతో పాటు నిత్యం పనులు కల్పించేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాదిలో 6 నెలలపాటు కూలిసొమ్ము చెల్లించని ప్రభుత్వం, ఇప్పుడు గత డిసెంబర్ 12 నుంచి ఈరోజు దాకా వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. ఇలాగైతే మేము ఎలా బతకాలి అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు. తమకు ఉపాధి పనులు వద్దంటూ ప్రత్యామ్నాయ పనులకు మళ్లుతున్నారు.
మండలం రూ.లక్షల్లో పనిచేసిన
కూలీలు
బి.కొత్తకోట రూ.40.20 633
చిన్నమండ్యం రూ.138.34 1,993
చౌడేపల్లి రూ.71.26 341
గాలివీడు రూ.98.52 2,347
గుర్రంకొండ రూ.53.55 591
కలకడ రూ.66.95 841
కలికిరి రూ.69.39 613
కంభంవారిపల్లె రూ.41.80 186
కురబలకోట రూ.48.23 504
లక్కిరెడ్డిపల్లె రూ.97.87 2,416
మదనపల్లె రూ.41.63 298
ములకలచెరువు రూ.83.61 1,601
నిమ్మనపల్లి రూ.33.79 263
పెద్దమండ్యం రూ.64.15 901
పెద్దతిప్పసముద్రం రూ.53.97 652
పీలేరు రూ.108.18 700
పుంగనూరు రూ.91.47 541
రామాపురం రూ.254.71 2,657
రామసముద్రం రూ.59.60 694
రాయచోటి రూ.65.57 1,697
సంబేపల్లి రూ.124.93 2,185
సదుం రూ.51.18 153
సోమల రూ.131.94 867
తంబళ్లపల్లె రూ.74.79 1,050
వాయల్పాడు రూ.125.73 846


