వాల్మీకిపురం : అంకుల్ అమ్మకు ఏమైంది.. అమ్మ కావాలి.. అంటూ చిన్నారి లోక్షిత రోధిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ఆదివారం హత్యకు గురైన మౌనిక మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. బెంగళూరు నుంచి మృతురాలి కుమారుడు కౌసిక్ (7), లోక్షిత (5) ఆసుపత్రికి చేరుకున్నారు. తన అమ్మను చూడాలని గంటల తరబడి ఆసుపత్రి ప్రాంగణంలో లోక్షిత పడిన తపన, ఆరాటాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.పాపను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గంటల తరబడి ఏడుస్తూ తన అమ్మ కోసం పరితపించిపోయింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


