అక్రమ మద్యంపై నిఘా పెంచండి | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యంపై నిఘా పెంచండి

Apr 18 2026 7:35 AM | Updated on Apr 18 2026 7:35 AM

మదనపల్లె: జిల్లాలో అక్రమ మద్యంపై నిఘా పెంచాలని, మత్తు పదార్థాల విక్రయాలు, దిగుమతిపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎకై ్సజ్‌, ఆదాయపన్నుశాఖలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చీప్‌ లిక్కర్‌, సారాను పూర్తిగా అరికట్టాలన్నారు. మద్యం దుకాణాలు, బార్లలో సీసీటీవీల పనితీరును పర్యవేక్షించి అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సారా తయారీదార్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చి మాన్పించేలా కృషి చేయాలన్నారు.

నీటి పనుల్లో నాణ్యత ఉండాలి

జిల్లాలో చేపట్టిన జలధార–జలహారతి 100 రోజుల కార్యాచరణను పక్కా ప్రణాళికతో అమలు చేసి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో సాధించిన ప్రగతిని సమీక్షించి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని మండలాల వారీగా జలధార–జలహారతి కార్యక్రమాల అమలు ప్రగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రత్యేక అధికారులు వివరించగా, పనులలో లోపాలను గుర్తించి సరిదిద్దాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఈ విఠల్‌ ప్రసాద్‌, లక్ష్మీపతి, ఆర్డీవో శ్రీనివాస్‌, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement