మదనపల్లె టౌన్ : చట్టం ముందు అందరూ సమానులే.. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతిబాబు హెచ్చరించారు. ఇటీవల మండలంలోని వేంపల్లెలో జరిగిన జాతరలో దళితులు డప్పు వాయించరాదని కళాకారులపై తాలూకా ఎస్ఐ రామకృష్ణారెడ్డి దాడి చేయడం జరిగిందని, బాధితులు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్సీ కమిషన్ సుమోటోగా తీసుకుని రాష్ట్ర ఎస్సీ కమిషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీపతిబాబు, మేకల బిక్షం, పి.గౌతం రాజ్ శుక్రవారం మదనపల్లె మండలం వేంపల్లె గ్రామంలో పర్యటించారు. బాధితులు, గ్రామస్తులను విచారణ చేశారు. బాధితుల నుంచి రాత మూ లకంగా వాగ్మూలం తీసుకున్నారు. అనంతరం తాలూ కా ఎస్ఐ. రామకృష్ణారెడ్డి, సీఐ కళా వెంకరమణను విచారించారు. అనంతరం త్రీమెన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈ నెల 12 రాత్రి చెన్నకేశవస్వామి జాతరలో డప్పు వాయిస్తుండగా రెండు వర్గాల వారు ఆధిపత్యం ప్రదర్శించారన్నారు. ఆ సమయంలో ఎస్ఐ డప్పు కళాకారులను అడ్డుకుని వారికి సపోర్టు చేయడమే కాకుండా దళితులపై దాడికి తెగబడినట్లు విచారణలో తేలిందన్నారు. ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాలే గానీ చట్టాన్ని చేతల్లోకి తీసుకోరాదన్నా రు. ఎస్సీ, ఎస్టీలకు తోడ్పాటు అందించి, అసమానతలు, కుల వివక్షతకు తావు లేకుండా పని చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. విచారణ అనంతరం సిద్ధం చేసిన నివేదికను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్రెడ్డి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, ఆర్ఐ బాలసుబ్రమణ్యం, ఏఎస్డబ్ల్యూఓ క్రష్ణయ్యలు పాల్గొన్నారు.


