● బండ రాళ్లతో కొట్టి చంపేశారు
● వారం కూడా తిరగకనే
మదనపల్లెలో మర్డర్
● వరుస హత్యలతో
భయాందోళన చెందుతున్న ప్రజలు
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలోని సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లె చెరువు కట్టపై ఆదివారం కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్(45) దారుణ హత్యకు గురైన ఘటన మరువకనే సీటీఎం దళితవాడకు చెందిన మేసీ్త్ర మురళి బుధవారం తన ఊరికి సమీపంలోని కంకర ఫ్యాక్టరీ వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మేసీ్త్ర హత్య కేసుకు సంబంధించి తాలూక సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. మండలంలోని సీటీఎం దళితవాడలో కాపురం ఉంటున్న మద్దన్న కుమారుడు పలక మురళి (40) భవన నిర్మాణ మేసీ్త్రగా పని చేస్తూ తన భార్య మంజుల, ముగ్గురు పిల్లలను పోషించు కునేవాడు. రెండు రోజుల క్రితం మురళి తన భార్య మంజులతో గొడవ పడినట్లు తెలసింది. గొడవ దేనికి జరిగింది అన్నది తెలియ రాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన తమ్ముడు రవి దగ్గర మురళి రూ.20 రూపాయలు తీసుకుని వెళ్లాడు. అయితే సాయంత్రం నుంచి మురళి ఫోన్ స్విచ్ఆఫ్ రావడం, పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించ లేదు. దీంతో రవి ఆందోళన చెందాడు. మురళితో కలసి కంకర ఫ్యాక్టరీ వైపు వెళ్లిన ఓ వ్యక్తి ని అనుమానించాడు. అతను కూడా కనిపించక పోడంతో కుటుంబీకులు కంకర ఫ్యాక్టరీ సమీపంలో బుధవారం గాలించగా, మేసీ్త్ర మురళి దారుణంగా హత్యకు గురైనట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో ఖాళీ బీరు బాటిళ్లు పడిఉన్నాయి. మురళీని చంపే ముందు హంతకులు కలసి మద్యం తాగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మురళీ శరీరానికి నిప్పు పెట్టి కాల్చిన ఆనవాళ్లు గుర్తించారు. ముందుగా బండ రాళ్లతో మురళి తల పగులగొట్టి.. ఆ తర్వాత కాల్చినట్లు గుర్తించారు. ఈ హత్య ఉదంతంపై తాలూక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు హత్య జరగిన ప్రాంతానికి చేరుకుని పంచనామా అనంతరం, పోసు మార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం రోజుల వ్యవధిలోనే మదనపల్లెలో రెండు దారుణ హత్యలు జరగడంతో పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది.


