మదనపల్లె: ఒక వైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కపోత.. వెరసి జనం విలవిల్లాడుతున్నారు. జిల్లాలో వారం రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాడ్పులు ‘ఉక్క’రిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఏప్రిల్ రెండవ వారంలోనే జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. ఫలితంగా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతోపాటు రాత్రి(కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరగుతున్నాయి. అటు పగలు, ఇటు రేయి ఉక్కపోతతో జనాలు నిద్రలు లేని రాత్రుల గడుపుతున్నారు. రానున్న రోజుల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
● బయటకు వెళ్లేటప్పుడు ఎండ తీవ్రతన తప్పించుకునేందుకు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ వాడాలి
● తెలుపురంగు, పలచటి వస్త్రాలతోపాటు లూజుగా ఉన్న దుస్తులనే దరించాలి
● ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 4 గంటల మధ్య అవసరమైతే తప్ప ఆరుబయట తిరగకూడదు
● వీలైనని సార్లు నీరు తాగడం చేయాలి. అలాగే ఎండలో తిరిగే సమయంలో కొబ్బరినీరు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నీటిలో నిమ్మరసం, కాస్తంత ఉప్పు కలిపిన ద్రావాణాన్ని కూడా అప్పడప్పుడు తీసుకుంటే
మంచిది.
● దూరప్రాంతాలకు ప్రయాణం చేసే వారు ఉదయం 10 గంటలలోపు గమ్యాలను చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే సాయంత్ర 4 గంటల తరువాత ప్రయాణం చేయాలి.
● ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, వికారంగా వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలను పాటించడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలి.
పెరిగిన విద్యుత్తు వినియోగం...
జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం కూడా భారీగా పెరిగింది. ఎండల తీవ్రతకు తట్టుకోలేక 24 గంటలను ఫ్యాన్లు తిరగాల్సి వస్తుంది. వీటితోపాటు కూలర్లు, ఏసీల వాడకం కూడా పెరిగింది. బయట తిరిగే జనాలు ఎండ నుంచి తప్పించుకునేందుకు టోపీలను, చిన్నపాటి గోడుగులను కొనుగోలు చేస్తున్నారు. వీటితోపాటు ఎత్తైన భవనాల్లో ఉండేవాళ్లు కూల్ పెయింట్లను వేయించుకుంటున్నారు.
ఠారెత్తిస్తున్న ఎండలు ...ఉక్కతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం
ఏప్రిల్ రెండో వారంలోనే42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
వేడి తీవ్రతకు అల్లాడుతున్న ప్రజానీకం
రాబోవు రోజుల్లో మరింత తీవ్రరూపం
జాగ్రత్తలు తప్పవంటున్న నిపుణులు


