మదనపల్లె సిటీ: జిల్లా కేంద్రంలో మదనపల్లెలో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ ఏటీఎంలు చాలా వరకు మూసివేశారు. మార్చి 31 నుంచి మదనపల్లె పట్టణంలో ఈ పరిస్థితి ఉందని ఖాతాదారులు వాపోతున్నారు. క్యాష్ డిపాజిట్ మెషిన్లు కూడా సక్రమంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. ఎస్బీఐ అధికారులు చర్యలు చేపట్టి నగదు కష్టాలకు పరిష్కారం చూపాలని వినియోగదారులు కోరుతున్నారు.
మదనపల్లె: అభివృద్ధి పనుల విషయంలో త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కరీముల్లాఖాన్కు సూచించారు. తమ శాఖ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఈఈ కలెక్టర్కు వివరించారు. గ్యారం పల్లె రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించిన పనులను శాఖద్వారా చేపట్టాలని కోరుతూ కలెక్టర్ పరిపాలన మంజూరు ఉత్తర్వును అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డిఈఈ సుధాకర్ పాల్గొన్నారు.
కడప సెవెన్రోడ్స్: సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వేణును డిప్యూటేషన్పై జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం వేణు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
మదనపల్లె సిటీ: శాప్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి లీగ్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు డీఎస్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. 23వతేదీ పుట్బాల్ అండర్–15 అండర్–21 బాల,బాలికల జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. మదనపల్లె పట్టణం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికై నవారు ఈనెల 28 నుంచి 30వతేదీ వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. బాక్సింగ్ బాల,బాలికలు అండర్–15, 19 జిల్లా స్థాయి ఎంపికలు ఈనెల 24వతేదీ మదనపల్లె బీటీ కాలేజీలో ఉదయం 8 గంటలకు జరుగుతుందన్నారు. జిల్లా పరిధిలోని పాఠశాలలు, కాలేజీలు, క్రీడా అకాడమీలకు చెందిన అర్హత కలిగిన క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. పాల్గొనేవారు తప్పనిసరిగా వయస్సు ధ్రువీకరణ పత్రం, అధార్ ,క్రీడా దుస్తులు తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 86399 57054, మస్తాన్ సీనియర్ అసిస్టెంట్ 73869 01200, చంద్రశేఖర్ డీఎస్డీఓ 91547 31106ను సంప్రదించాలని సూచించారు.
మదనపల్లె టౌన్: మదనపల్లె అగ్నిమాపక కేంద్రంలో మంగళవారం జాతీయ అగ్ని మాపక వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా అగ్ని మాపక అధికారి ఆదినారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అగ్ని ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూపించే పోస్టర్లను మదనపల్లె అగ్నిమాపక అధికారి శివన్నతో కలసి ఆవిష్కరించారు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల వివారణ సమయంలోనూ ఉపయోగించే వివిధ పరికరాల గురించి ప్రదర్శన ద్వారా క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై వగాహన కల్పిస్తూ ప్రజల్ని చేతన్యపరచడం జరుగుతుందని అగ్ని మాపక అధికారి శివప్ప తెలిపారు.


