వైభవంగా ముగిసిన గంగ జాతర
లక్కిరెడ్డిపల్లి: రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా ఖ్యాతిగాంచిన లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గంగమ్మ దేవత జాతర ఘనంగా ముగిసింది. గురువారం మైలు తిరుణాలకు వచ్చే మూడుదారులు భక్తులతో కిటకిటలాడింది. గురువారం అర్థరాత్రి దాటాక తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అమ్మవారు అశ్వవాహనంపై ఆశీనులై ఊరేగారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న రోడ్డుపై మంగళవాయిద్యాలు.. మిరుమిట్లుగొలిపే బాణసంచాలు.. భక్తుల కోలాహల నడుమ అంగరంగ వైభవంగా దర్శనమిస్తూ మెరవనిగా ఈడిగపల్లికి తిరుగు పయనమయ్యారు. తెల్లవారేసరికి అమ్మవారు ఆలయానికి ప్రవేశించారు. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వందల సంఖ్యలో చాందినీ బండ్లతోపాటు కుంకుమ, ఎద్దులబండ్లు జాతరకు తరలివచ్చాయి. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో డీఎస్పీ కృ,ష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, ఎస్ఐ డి శోభలు జాతరకు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. జాతర చివరిరోజు చాందినీ బండ్ల ఎదుట ఏర్పాటు చేసిన కోలాటం, చెక్కభజన భక్తులను అలరించాయి. జాతరలో ఏర్పాటు చేసిన జబర్దస్త్, రేలారే రేలా, డ్యాన్స్ ప్రోగ్రాంలతో యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. గంగమ్మ ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు జాతర ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఉత్సాహంగా బండలాగుడు పోటీలు
జాతరను పురస్కరించుకొని నిర్వాహకులు రాయలసీమ బండలాగుడు పోటీలను నిర్వహించారు. విజేత ఎడ్ల యజమానులకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా మొదటి బహుమతి రూ. ఒక లక్ష, ద్వితీయ బహుమతి రూ. 80 వేలు నగదును లక్ష్మీప్రసాద్ రెడ్డి అందజేశారు.
హుండీ ఆదాయం లెక్కింపు: అనంతపురం గంగమ్మ దేవత జాతర సందర్భంగా మూడురోజుల హుండీ ఆదాయాలను గురువారం లెక్కించారు. రూ. 17,96,420లు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ నగదు మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నట్లు వారు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో సిబ్బంది, పూజారులు పాల్గొన్నారు.
అశ్వవాహనంపై భక్తులను కరుణించిన అమ్మవారు
ప్రత్యేక ఆకర్షణగా చాందినీబండ్లు
తిరుగుపయనమైన చాగలగట్టుపల్లి, గొల్లపల్లి అమ్మవార్లు
వైభవంగా ముగిసిన గంగ జాతర


