శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఆలయంలో అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును తాగి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. కొందరు భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. పలువురు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హిందువులతోపాటు ముస్లింలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం.


