ఇంటి వద్దే కాన్పు చేసిన 108 సిబ్బంది
రామాపురం : ఓ మహిళకు ఇంటి వద్దనే 108 సిబ్బంది కాన్పు చేశారు. మండలంలోని నల్లగుట్టపల్లి గ్రామం బీసీ కాలనీలో గర్భిణి టి.సుబ్బమ్మ వయసు 20. నాల్గవ కానుపు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ 108కు ఫోన్ చేశారు. సకాలంలో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. పురిటినొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్ సిబ్బంది ఇంటి వద్దనే ఆమెకు ప్రసవం చేశారు. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం చికిత్స నిమిత్తం రామాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఈఎంటీ శివానందరెడ్డి, అంబులెన్స్ ఫైలెట్ శ్రీకాంత్ ఉన్నారు.
మాజీ సైనికుడిపై మందుబాబుల దాడి
రాయచోటి : రాయచోటి పట్టణ పరిధిలో మందుబాబుల వీరంగం రోజురోజుకు అధికమవుతోంది. మంగళవారం సాయంత్రం పీకలదాకా మద్యం తాగిన కొంతమంది మందుబాబులు మాజీ సైనికుడు గాదిరాజు రామ్మోహన్ రాజు(43) పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో రామ్మోహన్ రాజు తలకు, చేతులకు రక్త గాయాలు అయ్యాయి. ఎస్ఎన్ కాలనీ సమీపంలోని శివాలయం చెక్పోస్ట్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు అటుగా వస్తున్న రామ్మోహన్ రాజును అటకాయించి విచక్షణ రహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేసినట్లు తెలిసింది. దీంతో చెయ్యికి తీవ్రమైన గాయం కావడంతో పాటు తలపై రాడ్డు దెబ్బ బలంగా తగలడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. దాడి సంఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు చేశారు.
అట్టహాసంగా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్
కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్– 2025 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. క్రీడల్లో ఓవరాల్, వ్యక్తిగత, టీమ్ ఛాంపియన్ షిప్ విభాగంలో విజేతలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ చాంపియన్గా డి.ఏ.ఆర్ జట్టు నిలవగా, వ్యక్తిగత విభాగంలో చాంపియన్గా కానిస్టేబుల్ ఎల్.సతీష్(పి.సి 3322) కడప సబ్–డివిజన్ టీం చాంపియన్ షిప్ సాధించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, కడప డి.ఎస్.పి ఏ.వెంకటేశ్వర్లు, జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వేంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు డి.ఎస్.పి పి.భావన, పులివెందుల డి.ఎస్.పి మురళి, మైదుకూరు డి.ఎస్.పి జి.రాజేంద్ర ప్రసాద్, డి.టి.సి డి.ఎస్.పి అబ్దుల్ కరీమ్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటి వద్దే కాన్పు చేసిన 108 సిబ్బంది
ఇంటి వద్దే కాన్పు చేసిన 108 సిబ్బంది


