
ఆ ఊరంతా ఖాళీ..!
గుర్రంకొండ: కూటమి నేతలు పోలీసులపై దాడి చేసి, పోలీస్ జీపు అద్దాలు పగులగొట్టి విధ్వంసానికి పాల్పడిన సంఘటనలో.. గెరికుంటపల్లె ఊరంతా ఖాళీ అయింది. దాడికి పాల్పడిన నాయకులతోపాటు సామన్య ప్రజలు ఊరు విడిచి పరారీలో ఉన్నారు. జనసంచారం లేక ఊరంతా వెలవెలబోతోంది. ఈ సంఘటనపై ఎనిమిది రోజులుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత మందిపై కేసు నమోదు చేశారన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నడిమికండ్రిగ పంచాయతీ గెరికుంటపల్లె గ్రామంలో గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించే విషయమై పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ నెల 10వ తేదీ రాత్రి తిరునాల సందర్భంగా చాందినీ బండ్ల ముందు రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించాలని కూటమి నేతలు పట్టుబట్టారు. అనుమతి లేకుండా నిర్వహించకూడదని పోలీసులు అడ్డుకొన్నారు. ఈ విషయమై నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో నాయకులు ఒక్కసారిగా పోలీసులపై మూకుమ్మడిగా దౌర్జన్యానికి దిగి దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా పోలీస్జీపు అద్దాలు పగులగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతరం పోలీసు ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
ఎనిమిది రోజులుగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని కూటమి నాయకులతోపాటు సామాన్య ప్రజలు పరారయ్యారు. నాయకులతోపాటు ఎక్కడ తమను కేసుల్లో ఇరికిస్తారోనని పలువురు గ్రామం విడిచి వెళ్లిపోయారు. గ్రామంలో చిన్నపిల్లలు, మహిళలు తప్ప పురుషులు ఉండటం లేదు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు ఈ కేసులో ఉన్న వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ రోజు రాత్రి పోలీసులపై ఎంత మంది దాడికి పాల్పడ్డారు. పోలీసు జీపు అద్దాలను పగులగొట్టింది ఎవరు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువుర్ని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఇంకా పలువుర్ని గుర్తించే పనిలో పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. తొందరలోనే దర్యాప్తు పూర్తి చేసి ఎంత మందిపై కేసు నమోదు చేశారో అన్న వివరాలు వెలుగు చూసే అవకాశముంది. ఈవిషయమై ఎస్ఐ రఘరామ్ను వివరణ కోరగా కేసు దర్యాప్తులో ఉందన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, ఈ సంఘటనలో ఎంత మంది పాల్గొన్నారో అంత మందిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
ఐదుగురి అరెస్ట్
నాయకులతోపాటు సామాన్యులు పరారీ
జనసంచారం లేక వెలవెలబోతున్న గెరికుంటపల్లె
ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

ఆ ఊరంతా ఖాళీ..!