
మదనపల్లెలో రియల్టర్ దారుణ హత్య
మదనపల్లె రూరల్ : పట్టణ శివారుప్రాంతం, బసినికొండ పంచాయతీలో జాతీయరహదారికి ఆనుకుని బైపాస్రోడ్డులో ఆదివారం రాత్రి రియల్టర్, వడ్డీ వ్యాపారి నారప్పగారి గంగాధర (37) దారుణహత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో తన భర్తను కొట్టి చంపినట్లు భార్య వనిత పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, విచారణలో భాగంగా తాలూకా పోలీసులు మృతుడి భార్య వనితపై అనుమానం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు గంగాధర, 11 ఏళ్ల క్రితం జరిగిన తన తండ్రి కృష్ణమూర్తి హత్యకేసులో ప్రధాన నిందితుడు. పీలేరు రాజీవ్నగర్కు చెందిన హరిబాబు, ఉషారాణిల కుమార్తె వనితను, మదనపల్లె మండలం బసినికొండకు చెందిన నారాయణమ్మ, కృష్ణమూర్తి కుమారుడు గంగాధరకు ఇచ్చి 13 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి కుమారుడు మోక్షిత్(7), కుమార్తె హిమప్రియ(10) ఉన్నారు. గంగాధర్ మదనపల్లె బైపాస్రోడ్డు రామతులసీ కల్యాణమండపం సమీపంలోని నక్కలకుంట వద్ద సొంత ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నాడు. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాడు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇంట్లో మద్యం మత్తులో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు వచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ సమాచారాన్ని మృతుడి భార్య వనిత రాత్రి 11 గంటల సమయంలో తాలూకా పోలీసులకు ఫోన్చేసి తెలిపింది. దీంతో తాలూకా సీఐ కళావెంకటరమణ, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతుడి ముఖంపై రాళ్లతో కొట్టిన ఆనవాళ్లు, గొంతును తాడుతో బిగించినట్లు గుర్తించారు. ఘటనాస్థలం పరిశీలన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచే హత్యపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా సోమవారం ఉదయం డీఎస్పీ మహేంద్ర ఘట నాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం ఆధారాలు సేకరించింది. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుడి భార్య వనితను హత్య ఘటనపై ప్రశ్నిస్తే...పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా మృతుడు గంగాధర, రియల్ ఎస్టేట్, వడ్డీవ్యాపారాలు చేస్తున్నందున, ఎవరైనా గిట్టనివారు హత్యకు పాల్పడ్డారా..? ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధమా..? అనే కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. కాగా, మృతుడు 2014లో అతని తండ్రి కృష్ణమూర్తిని హత్యచేసి చెరువులో పడేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు ఆధారంగా తాలూకా పోలీస్ స్టేషన్లో గంగాధరపై రౌడీషీట్ ఉంది. హత్యకేసు విచారణలో శిక్ష పడకపోవడంతో తర్వాత కాలంలో రౌడీషీట్ను తీసివేయించుకున్నాడు. గంగాధర నేరచరిత్ర కలిగిన వ్యక్తి కావడం, భార్యపై తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ వేధింపులకు పాల్పడేవాడు. వివాహేతర సంబంధం కారణంగా , భార్యతో తరచూ గొడవలు పడేవాడు.. ఈ క్రమంలో గంగాధర హత్యకేసులో మృతుడి భార్యను అదుపులోకి తీసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు దారితీసిన పరిస్థితులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఇంట్లోనే బండరాళ్లతో కొట్టి చంపిన వైనం
గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి తన కళ్లముందే చంపారన్న భార్య
దర్యాప్తులో భాగంగా మృతుడి భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు
11 ఏళ్లక్రితం జరిగిన తండ్రి హత్యకేసులో మృతుడు నిందితుడు
ఆధారాలు సేకరించిన క్లూస్టీం, ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ మహేంద్ర

మదనపల్లెలో రియల్టర్ దారుణ హత్య