
విద్యార్థులూ.. బస్సు పాసులు పొందండిలా..!
మదనపల్లె సిటీ : పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు బస్సు పాసుల జారీకి ఆర్టీసీ డిపో అధికారులు చర్యలు చేపట్టారు. మదనపల్లె ఆర్టీసీ డిపో పరిధిలోని వన్, టు డిపోలలో ఉన్న బస్సు పాస్ కౌంటర్ వద్ద ఉచిత, రాయితీ బస్సు పాసులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఇక్కడి కౌంటర్లో దరఖాస్తు ఫారాలు తీసుకుని పూర్తి చేసి, నిర్ణీత పత్రాలు జతచేసి కౌంటర్లోని సిబ్బందికి అందజేసి పాసులు పొందవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకుని పాసులు తీసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బస్పాసు దరఖాస్తుల ఆధునీకరణ ప్రక్రియ జరుగుతోంది. సోమవారం నుంచి యథావిధిగా కొత్త పాసులు విద్యార్థులకు జారీ చేస్తున్నారు. ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడి కౌంటర్ వద్ద సిబ్బందిని సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
వీరికి ఉచితం..
ఏడో తరగతి వరకు చదివే 12 ఏళ్లలోపు బాలురు, పదో తరగతి వరకు చదివే 18 ఏళ్లలోపు బాలికలు మాత్రమే ఉచిత పాసులు తీసుకునేందుకు అర్హులు. విద్యార్థి ఇంటి నుంచి పాఠశాలకు 20 కిలో మీటర్ల లోపు దూరం ఉంటేనే ఉచిత బస్సు పాసు జారీ చేస్తారు. ఇవి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ పాసుల కోసం దరఖాస్తు ఫారంపై పాస్పోర్టుసైజు ఫొటోలు అంటించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో పాటు స్టాంపు వేయించాలి. పూర్తి చేసిన దరఖాస్తుకు ఒరిజినల్ ప్రస్తుత స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు నకలు జత చేసి స్థానిక ఆర్టీసీ పాసుల కౌంటర్ వద్ద అందజేస్తే పాస్ ఇస్తారు. దరఖాస్తు సమర్పించే సమయంలో రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఇవి కూడా కేవలం పాసు నామినేషన్ ఐడీ కార్డు నిమిత్తమే తీసుకుంటారు.
రాయితీతో చెల్లింపు పాసు..
ఒక నెల, మూడు నెలలు, సంవత్సర కాల వ్యవధికి చెల్లుబాటయ్యేలా విద్యార్థులకు 33 శాతం రాయితీతో చెల్లింపు పాసులు (స్టూడెంట్ పెయిడ్ పాసులు) కూడా ఆర్టీసీ జారీ చేస్తుంది. వీటి కోసం పాఠశాల, కళాశాల విద్యార్థులు ఎవరైనా చదివే పాఠశాల, కళాశాల మధ్య దూరం 50 కిలో మీటర్లు లోపు ఉంటేనే ఈ పాసులు జారీ చేస్తారు. ఇంటి నుంచి విద్యా సంస్థకు మధ్య ఉన్న దూరం, కాలవ్యవధిని అనుసరించి రాయితీ స్టూడెంట్ పెయిడ్ పాసుల ధర ఉంటుంది. దరఖాస్తు ఫారంలో పైన ఒక పాస్పోర్టు సైజు ఫొటో, కింద ఉండే బోనఫైడ్ సర్టిఫికెట్పై ఒక ఫోటో అంటించి వాటిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా కాలేజీ ప్రిన్సిపాల్ సంతకంతో పాటు స్టాంపు వేయించాలి. పూర్తి చేసిన దరఖాస్తుకు ప్రస్తుతం ఒరిజినల్ స్టడీ సర్టిఫికెట్, పదోతరగతి మార్కుల జాబితా నకలు, ఆధార్కార్డు నకలు జత చేసి సమర్పించాలి. మొదటిసారి ఏ కాల పరిమితితో పాసు తీసుకున్నారో తర్వాత రెన్యువల్ పాస్ కూడా అదే కాలపరిమితికి జారీ చేస్తారు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..
విద్యార్థులు బస్ పాస్లను సద్వినియోగం చేసుకోవాలి. డిపోలో ప్రత్యేక కౌంటర్లో పాసులు జారీ చేస్తున్నాం. దరఖాస్తులు పూర్తి చేసి అందజేస్తే పాసులు అందిస్తాం. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టూడెంట్ బస్సులు నడుపుతున్నాం.
–మూరే వెంకట రమణారెడ్డి, ఆర్టీసీ–1డిపో మేనేజర్

విద్యార్థులూ.. బస్సు పాసులు పొందండిలా..!