
బీజేపీ నాయకుడి క్వారీపై గూండాల దాడి
మదనపల్లె రూరల్ : బీజేపీ నాయకుడు జబ్బల శ్రీనివాసులు క్వారీపై శనివారం రాత్రి గూండాలు దాడి చేసి, టిప్పర్ అద్దాలు, యంత్రాలను ధ్వంసం చేయడంతోపాటుగా సిబ్బందిని గాయపరిచినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సందర్భంగా బాధితుడు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ.. మండలంలోని బసినికొండ గ్రామ పంచాయతీ సర్వే నంబర్:1072లో 3.50 హెక్టార్లలో తన పేరు మీద, భార్య జబ్బల మీనా పేరు మీద ప్రభుత్వ అనుమతితో 2004లో క్వారీ లీజుకు ఇస్తూ ఎన్ఓసీ మంజూరు చేశారన్నారు. 2007లో గాయత్రి స్టోన్ క్రషర్ పేరు మీద 1 హెక్టార్, 2009లో సర్వే నంబర్ 1072లో 1.780 హెక్టార్ల ప్రభుత్వ భూమిని క్వారీ పనులకు భూగర్భ గనుల శాఖ అనుమతులను ఇచ్చిందన్నా రు. అయితే కొంత కాలంగా క్వారీ స్థలానికి సంబంధించి తమకు డీకేటీ పట్టా భూమి ఉందని కొందరు పనులకు అంతరాయం కలిగించారన్నారు. దీంతో తాను మదనపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ఆశ్రయించడంతో ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. జూన్ 3న మదనపల్లె భూగర్భ గనులశాఖ అధికారి, జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా క్వారీలో సర్వే నిర్వహించారన్నారు. పట్టా ఉందని చెప్పుకొంటున్న మునిస్వామి ఆచారి భార్య, కుటుంబ సభ్యులను ఇన్స్పెక్షన్కు హాజరు కావాలని కోరడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు సర్వేలో పాల్గొని, మునిస్వామి ఆచారి కుటుంబ సభ్యులకు భూమి ఉందా లేదా అనే విషయమై రికార్డులు పరిశీలించి, గనుల శాఖ అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారన్నారు. అయితే...14వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఓ రాజకీయ నాయకుడి ముఖ్య అనుచరుడి ఆదేశాలతో సుమారు 30 మందికి పైగా కర్రలు, రాళ్లుతో వచ్చి క్వారీలోని యంత్రాలు, టిప్పర్ లారీ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు అక్కడ ఉన్న సిబ్బందిని గాయపరిచారన్నారు. భూమి తమదేనని, ఎలాంటి క్వారీ పనులు చేయవద్దని దుర్భాషలాడుతూ గొడవకు దిగారన్నా రు. రాష్ట్ర భూగర్భ,గనులశాఖ కేటాయించిన క్వారీ స్థలంలో అన్ని ప్రభుత్వ అనుమతులతో తాను క్వారీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2004 నుంచి కొంత కాలం వరకు మునిస్వామి ఆచారి కుటుంబ సభ్యు లు, లేదా ఇతరులు ఎవరూ తమ క్వారీ వద్దకు రాలేదన్నారు. స్థలం తమదంటూ రెవెన్యూ అధికారులను సంప్రదించలేదన్నారు. ఉద్దేశ పూర్వకంగానే కొందరు వ్యక్తులు తనను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో, భూ మిపై హక్కులు ఉన్నాయని తెలుపుతూ, గొడవలు, ఘర్షణలకు దిగుతున్నారన్నారు. అనుమతి లేకుండా క్వారీ స్థలంలో ప్రవేశించి టిప్పర్ అద్దాలు, యంత్రాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాల్సిందిగా డీఎస్పీ మహేంద్ర, తాలూకా సీఐ కళావెంకటరమణ, ఎస్ఐ గాయత్రికి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
టిప్పర్ అద్దాలు, యంత్రాలు ధ్వంసం
సిబ్బందిపై రాళ్ల దాడి

బీజేపీ నాయకుడి క్వారీపై గూండాల దాడి