
ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె సిటీ : కుటుంబ సమస్యలతో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మదనపల్లె పట్టణం శేష్మహల్ ఏరియాకు చెందిన సురేష్(39) భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మదనపల్లె మండలం బసినికొండకు చెందిన శివశంకర్ కుటుంబ సమస్యల కారణంగా పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వివాహిత అనుమానాస్పద మృతి
పోరుమామిళ్ల : మండలంలోని దమ్మన్నపల్లె పంచాయతీ సుంకేసులపల్లెలో ఆదివారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చెముడూరి నరేంద్ర మండలంలోని కాలువకట్టకు చెందిన మహాలక్ష్మి(25)ని ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆయన తాపీమేసీ్త్రగా పని చేస్తుంటాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భర్తే చంపేసి, ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. నిత్యం తాగుతూ తన కూతురిని చిత్రహింసలకు గురి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర పరారీలో ఉన్నాడు. ఎస్ఐ కొండారెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విచారణ పూర్తయితే పూర్తి వివరాలు తెలుస్తాయి.
మైదుకూరులో లారీ చోరీ
మైదుకూరు : పార్కింగ్ చేసి ఉన్న తన లారీని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్టు మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన చాగంరెడ్డి సాంశివారెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని వనిపెంట రోడ్డులో ఉన్న జగన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద తన సొంత లారీని పార్కింగ్ చేసి ఉంచినట్టు సాంబశివారెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం చూడగా తన లారీ కనిపించలేదని, శనివారం రాత్రి చోరీకి గురై ఉంటుందని తెలిపారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ నగర అధ్యక్షుడు
అప్జల్ఖాన్ రాజీనామా ఆమోదం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ఖాన్ రాజీనామాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎట్టకేలకు ఆమోదించారు. ఆయన మార్చి 27న తన రాజీనామా లేఖను పీసీసీ కార్యాలయానికి పంపారు. దీంతో అధికారంగా ఈ నెల 12న రాజీనామాను ఆమోదించినట్లు డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఆదివారం ప్రకటించారు.
కాంగ్రెస్ సమావేశానికి గైర్హాజరు
నగరంలోని ఐఎంఎ హాల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 12న నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి నగర అధ్యక్షుడు గైర్హాజరయ్యారు. అదే విధంగా డీసీసీ అధ్యక్షురాలు, నగర అధ్యక్షుడి మధ్య పార్టీ కార్యక్రమాల్లో సయోధ్య కుదరడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం.