
పాడేరులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన ప్రదర్శన
అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో పాడేరు పాత బస్టాండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలు, రెడ్బుక్ రాజ్యాంగంపై ధ్వజమెత్తారు.
బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలుజేయాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని కురుసా పార్వతమ్మ విమర్శించారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు. అయినా, తోటి మహిళగా హోంమంత్రికి బాధితులను పరామర్శించే కనీస దయ కూడా లేకుండాపోయిందని దుయ్యబట్టారు.