ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి | YSRCP TJR Sudhakar Babu and YSRCP leaders Slams TDP Atrocities | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి

Feb 18 2025 4:49 AM | Updated on Feb 18 2025 4:49 AM

YSRCP TJR Sudhakar Babu and YSRCP leaders Slams TDP Atrocities

మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది  

పోలీసుల సహాయంతో కౌన్సిలర్లను ఎత్తుకుపోతారా? 

తుని ఎన్నికను కలెక్టరే పర్యవేక్షించాలి 

కూటమి నేతల దౌర్జన్యాలపై వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, రాజమహేంద్రవరం/నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి పార్టీ లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ మండిపడింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు పోలీసుల సాయంతో కౌన్సిలర్లను ఎత్తుకుపోతూ, దాడులు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీకి ఏమాత్రం బలం లేని తుని, పాలకొండ, పిడుగురాళ్లలో వైస్‌ చైర్‌పర్సన్‌ ఉప ఎన్నికల్లో దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశాల్లో మాట్లాడుతూ టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. 

కక్కిన కూటి కోసం ఆశపడే దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు: టీజేఆర్‌ సుధాకర్‌బాబు  
దాడులు, దౌర్జన్యాలతో వైఎస్సార్‌సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి చంద్రబాబు టీడీపీ వైపు తిప్పుకొంటున్నారు. స్థానిక సంస్థల్లో సంఖ్యా బలం లేకపోయినా కక్కిన కూటి కోసం ఆశపడే దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారు. పిడుగురాళ్లలో అక్రమ మార్గంలో టీడీపీ గెలుపొందింది. పాలకొండలో 20 మంది సభ్యులుండగా ఒకరు రాజీనామా చేశారు. 13 వైఎస్సార్‌సీపీ, 6 టీడీపీకి ఉన్నాయన్నారు. అక్కడ వైఎస్సార్‌సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు.

కానీ వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మకంగా కోరం లేకుండా చేసింది. తునిలో మున్సిపాలిటీ 30 స్థానాలనూ వైఎస్సార్‌సీపీ గెల్చుకుంది. అయినా వైస్‌ చైర్మన్‌ పదవి కోసం టీడీపీ చేయని అక్రమాలు లేవు. 9 మంది కౌన్సిలర్లపై దాడులు చేసి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకున్నారు. పిడుగురాళ్లలోనూ మొత్తం 33 కౌన్సిల్‌ స్ధానాలనూ వైఎస్సార్‌సీపీనే గెల్చుకున్నా, అక్కడి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పోలీసులను అడ్డం పెట్టుకుని కిడ్నాప్‌లు, బెదిరింపులకు పాల్పడి కౌన్సిలర్లను టీడీపీ వైపు తిప్పుకున్నారు. 

టీడీపీది దుర్మార్గం: కన్నబాబు  
తునిలో పోలీసుల సాయంతో కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, మున్సిపల్‌ చైర్మన్‌ ఇంటి వద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం అధికార కూటమి పార్టీ ల దుర్మార్గ విధానాలకు నిదర్శనం. కలెక్టరే స్వయంగా తుని ఉప ఎన్నికను దగ్గరుండి పర్యవేక్షించాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. కౌన్సిలర్లను అధికారులే ఇంటి నుంచి కౌన్సిల్‌ హాలుకు తీసుకువెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా తీసుకురావాలి. ఒక్క మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి కోసం కూటమి నేతలు ఇంతగా తెగబడతారా? రాష్ట్రంలో రాజ్యాంగం పనిచేస్తోందా అన్న అనుమానం వస్తోంది. అందుకే వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా మంగళవారం తుని వెళతాం. 

ఇది ప్రజాస్వామ్యమా?: చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 
మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు, అనైతికత చూస్తే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచి్చన హామీలను ఎగ్గొట్టారు. అభివృద్ధిపై దృష్టే లేదు. ఆయన ధ్యాసంతా ప్రజలు మనోభావాలకు విరుద్ధంగా వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచిన సభ్యులను కొనుగోలు చేయడం, దౌర్జన్యాలతో లొంగదీసుకోవడం పైనే ఉంది.  

ఇది కూటమి ప్రభుత్వం అరాచకం: కాసు మహేష్‌రెడ్డి 
మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది. అతి చిన్న ఎన్నికైన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లోనే చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. పిడుగురాళ్లలో మొత్తం 33 స్థానాలనూ వైఎస్సార్‌సీపీ క్లీ¯Œన్‌ స్వీప్‌ చేసింది. కానీ నేడు చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లతో వైస్‌ చైర్మన్‌  పదవి దక్కించుకున్నారు. ప్రలోభాలకు గురిచేసినా, తప్పుడు కేసులు పెట్టినా, ఆఖరికి కష్టపడి కట్టుకున్న ఇంటిని, బంధువు ఇంటిని కూల్చివేసినా టీడీపీకి మద్దతి­చ్చేది లేదని తేల్చి చెప్పిన 29వ వార్డు కౌన్సిలర్‌ సైదావలికి సెల్యూట్‌ చేస్తున్నాను. సైదావలి లాంటి కార్యకర్తలే జగన్‌కు  శ్రీరామరక్ష.

Advertisement
 
Advertisement
Advertisement