
చంద్రబాబు అండ్ గ్యాంగ్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు
సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల ముందు డైలాగులు
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తిగా దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
వైఎస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన రుణంలో ఒక్క ఏడాదిలోనే బాబు 41 శాతం అప్పు
కేంద్ర ఆదాయం 13.76% పెరిగితే.. రాష్ట్ర ఆదాయం వృద్ధి 3.08 శాతమే
తగ్గిన రాష్ట్ర ఆదాయం అంతా చంద్రబాబు గజదొంగల ముఠా జేబుల్లోకి వెళ్తోంది
బాబు యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్ల ద్వారా రూ.11 వేల కోట్ల కుంభకోణం
సెకీతో గత ప్రభుత్వ ఒప్పందం వల్ల రాష్ట్రానికి రూ.89,675 కోట్లు ఆదా
ఈ ఒప్పందానికి చంద్రబాబు గజదొంగల ముఠాలోని ఈనాడు వక్రీకరణ
సెకీతో ఒప్పందం కుదుర్చుకునే నాటికి రామేశ్వర్ప్రసాద్ గుప్తా ఎండీగా లేరు
ఆయన్ను ఇటీవల కేంద్రం తప్పిస్తే సెకీ ఒప్పందానికి సన్మానం అంటూ వక్రభాష్యం
‘ఈనాడు’ న్యూస్ పేపర్ కాదు.. టాయిలెట్ పేపర్కు ఎక్కువ.. టిష్యూ పేపర్కు తక్కువ
అమరావతి కుంభకోణాల ఖజానా.. ధరలు పెంచి దోచుకోవడమే బాబు విధానం
సచివాలయం.. అసెంబ్లీ విషయానికి వస్తే ఇప్పటికే అవి ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ ఆఫీసులు కడతారట. వాటి కోసం 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణాలు చేస్తారట. నిజానికి సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ భవనాలతో కలుపుకుని అంతా 12 వేల మంది వరకు ఉద్యోగులు ఉంటారు. వారు ఇప్పటికే 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో పని చేస్తున్నారు. మరి కొత్తగా 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణం ఎందుకు? అంటే, ఆ పనులు నిరంతరం జరగాలి. ఆ మేరకు కమీషన్లు రావాలి.
ఇప్పటికే కట్టిన అసెంబ్లీ వ్యయం రూ.180 కోట్లు, సచివాలయ వ్యయం రూ.300 కోట్లు.. రెండూ గంగపాలైనట్లే. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు.. అలా మొత్తం రూ.600 కోట్లు వెచ్చించారు. కొత్త భవనాలు కట్టాలనుకున్నప్పుడు ఈ రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఈ నిర్ణయాలు సమంజసం అని ఎలా చెబుతారు? అప్పులు తెచ్చి భవనాలు కట్టి, ప్రజలపై భారం మోపడం ఎందుకు? ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.8,900. సాధారణంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.4,500 పెడితే హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోనే ఫైవ్ స్టార్ వసతులతో భారీ అపార్ట్మెంట్లు దొరుకుతాయి.
హైదరాబాద్లో ఇటీవల కొత్త సచివాలయం 8.58 లక్షల చదరపు అడుగుల్లో రూ.600 కోట్లతో కట్టారు. దాంతో పాటు, హెచ్ఓడీ ఆఫీసులు కూడా తరలించారు. మరి ఇక్కడ 53.57 లక్షల చదరపు అడుగుల భవనాలు ఎందుకు? అమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయం కూడా దారుణం. ఫోర్ లేన్ల జాతీయ రహదారుల నిర్మాణం కోసం కిలోమీటరు వ్యయం రూ.11.16 కోట్ల నుంచి రూ.14.42 కోట్లు ఉంటుంది. అదే అమరావతిలో కిలోమీటరు రోడ్డుకు రూ.50 - 60 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
రాజధాని అమరావతికి ఇప్పటికే ఉన్న 50 వేల ఎకరాలు ఈ పెద్దమనిషికి సరిపోదట. ఇంకో 50 వేల ఎకరాలు కావాలట. ఇన్నిన్ని అప్పులు తెచ్చి, ఇన్నిన్ని స్కాములు చేసే బదులు.. విజయవాడృగుంటూరు మధ్య ఎన్హెచ్ దగ్గర్లో నాగార్జున యూనివర్సిటీలోనో, లేదంటే విజయవాడృగుంటూరు మధ్య ఓ 500 ఎకరాలు తీసుకుని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్లు ఏవో కట్టు. అప్పుడు గుంటూరుృవిజయవాడ కలిసిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది.
ఇదే చంద్రబాబు గతంలో అమరావతిలో నిర్మాణాలు చేసి, లంచాలు తీసుకుని దొరికిన సందర్భం ఉంది. అందుకు చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు కూడా ఇచ్చింది. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉంది. కేసు ఎదుర్కొంటున్నాడు. అయినా ఏమాత్రం జంకు, బొంకు లేకుండా మళ్లీ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నాడు. - వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా దోపిడీతో రాష్ట్రం అతలాకుతలమైపోతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిందని, ఓ వైపు అప్పులు విపరీతంగా పెరుగుతుంటే.. మరో వైపు ఆదాయం తగ్గిపోతోందని ఎత్తి చూపారు. ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం చంద్రబాబు గజ దొంగల ముఠా జేబుల్లోకి వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదికలో ఎక్కడా ఏపీలో అభివృద్ధి, సంక్షేమం జాడ కనిపించ లేదన్నారు.
గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలప్పుడు సంపద సృష్టిస్తా.. సంక్షేమం పంచుతానని చంద్రబాబు గొప్పగా డైలాగులు కొట్టారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏడాదిగా ప్రజలను వంచించడం.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి బినామీలకు పంచి పెట్టడంతో సరిపోయిందన్నారు. ఇసుక నుంచి సిలికా వరకు సహజ వనరులను మింగేస్తున్నారని తూర్పారబట్టారు.
కేంద్ర ప్రభుత్వ పన్నులు, పన్నేతర ఆదాయం వృద్ధి చెందుతుంటే.. ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో రాబడి లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందని దుర్మార్గపు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో.. చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే 41 శాతం అప్పులు చేశారని ఎత్తిచూపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
నాణేనికి రెండో వైపు ఇలా..
» రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై నాణానికి రెండో వైపున ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మన యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాదు. చెడిపోయిన ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారిని రెండేళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా రాష్ట్రాన్ని గొప్పగా నడిపాం. అలా చేస్తూనే సంక్షేమం, అభివృద్ధి చూపాం. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. పెట్టుబడులు కూడా పెరిగాయి.
» అదే చంద్రబాబు ఏడాది పాలన చూస్తే.. కాగ్ నివేదిక గమనిస్తే.. ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. చంద్రబాబు పాలనంతా కూడా ఈ ఏడాది మోసాలతో సాగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగరగొట్టారు. రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్ఓఆర్).. పన్ను, పన్నేతర ఆదాయం రెండూ గమనిస్తే ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉంది. కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్రేట్ కనిపిస్తోంది. అందుకు కారణం ప్రజల కొనుగోలు శక్తి, పెట్టుబడులు తగ్గాయి.
» ఇదే సమయంలో దేశంలో దాన్ని చూస్తే, గ్రాస్ టాక్స్ రెవెన్యూస్, నాన్ టాక్స్ రెవెన్యూస్లో ఏకంగా 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.36,97,545 కోట్లు. అదే గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.32,50,181 కోట్లు. మన రాష్ట్ర ఆదాయంలో అంత తక్కువ పెరుగుదలకు కారణం ఆ ఆదాయం రాష్ట్ర ఖజానాకు కాకుండా చంద్రబాబునాయుడు, ఆయన గజదొంగల ముఠా జేబుల్లోకి వెళ్లడమే.
విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి
» రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరిందని చెప్పడానికి మరో ఉదాహరణ యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఇది ఏకంగా రూ.11 వేల కోట్ల స్కామ్. యాక్సెస్ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్, వారి పీఎల్ఎఫ్ ప్రకారం ఏడాదికి 10 కోట్ల యూనిట్లు, యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా 210 కోట్ల యూనిట్లు కొంటున్నారు. ఒక్కో యూనిట్ ధర రూ.4.60. అదే మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం యూనిట్ విద్యుత్ రూ.2.49 మాత్రమే. అంటే ఒక్కో యూనిట్కు చంద్రబాబు ప్రభుత్వంలో అదనంగా రూ.2.11 చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 210 కోట్ల యూనిట్లకు రూ.440 కోట్ల చొప్పున 25 ఏళ్లకు పడే భారం రూ.11 వేల కోట్లు.
» ఇది ఇచ్చేటప్పుడు చంద్రబాబు తెలివిగా బీబీబీ (బండ్లింగ్, బ్యాంకింగ్. బ్యాలెన్సింగ్) అన్న ప్రస్తావన తెచ్చారు. అంటే 4 గంటల పీక్ అవర్ అని చెప్పి, మొత్తం 24 గంటలకు యూనిట్ రూ.4.60కి కొంటూ స్కామ్ చేస్తున్నారు. ఈ మధ్య సెకీ పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ విద్యుత్ ధర కేవలం రూ.3.53 మాత్రమే. వాటిలో ఎన్టీపీసీ, రిలయెన్స్ సంస్థలు ఉన్నాయి. ఆ ధర లెక్క వేసుకున్నా రూ.1.07 ఎక్కువ ధర చెల్లిస్తున్నట్లే. ఆ విధంగా చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారు.
స్కామ్లలో పరాకాష్ట.. అమరావతి నిర్మాణం
» స్కామ్లలో పరాకాష్ట అమరావతి పనుల్లో అవినీతి వ్యవహారం. ఆ పనులకు సంబంధించి 2018లో టెండర్ల విలువ రూ.41,170.78 కోట్లు కాగా, అందులో అప్పుడు రూ.5,587.28 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇంకా రూ.35,583 కోట్ల పనులు మిగిలాయి. వాటిని రద్దు చేసి, మిగిలిన పనుల అంచనాలు విపరీతంగా పెంచి ఇప్పుడు దోపిడీ చేస్తున్నారు.
» అందుకోసం గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన జుడీషియల్ రివ్యూ విధానాన్ని, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. ఈ స్కామ్లో తమ సదుపాయం కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. మా హయాంలో అది లేదు. కానీ, చంద్రబాబు దాన్ని తీసుకొచ్చి, టెండర్ ఇవ్వగానే 10 శాతం అడ్వాన్స్ ఇచ్చి, అందులో 8 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. ఐదు ఐకానిక్ టవర్లను ఒక్కో చదరపు అడుగు వ్యయం రూ.8,931తో నిర్మిస్తున్నారు.
» సచివాలయం.. అసెంబ్లీలు ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ ఆఫీసులు 53,57,389 చదరపు అడుగులతో నిర్మిస్తారట. నిజానికి సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ భవనాలతో కలుపుకుని అంతా 12 వేల మంది వరకు ఉద్యోగులు ఉంటారు. ఈ లెక్కన కొత్తగా 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణం మీ కమీషన్ల కోసం కాదా?
సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ.. అన్నీ అప్పులే
» అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని అందరినీ మభ్య పెడుతూ, చంద్రబాబు చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేఎఫ్డబ్ల్యూ (జర్మనీ) బ్యాంక్ నుంచి రూ.5 వేల కోట్లు, సీఆర్డీఏ బాండ్ల నుంచి రూ.21 వేల కోట్లు.. ఇలా ప్రస్తుతానికి రూ.52 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో రూ.6 వేల కోట్లు కేటాయించారు. మరి ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్?
» ఇప్పటికే ఉన్న 50 వేల ఎకరాలకు సంబంధించే ఈ మధ్య ఫైనాన్స్ కమిషన్కు చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చి, రూ.77 వేల కోట్లు కావాలని అడిగారు. ఈ లెక్కన అమరావతి కోసం చేస్తున్న, చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకే అర్థమవుతుంది. ఇవి కాక మళ్లీ 50 వేల ఎకరాలు సేకరించి అమరావతిని విస్తరిస్తారట ఈ పెద్దమనిషి! అమరావతి విస్తరణకు మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నాడు. మరి ఈ పనులకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? అది అయిపోయే సరికి రూ.2, 3 లక్షల కోట్ల మొత్తం ఎన్ని లక్షల కోట్లు అవుతుంది?
» ఇన్నిన్ని అప్పులు తెచ్చి, ఇన్నిన్ని స్కాములు చేసే బదులు.. అయ్యా చంద్రబాబూ.. నీ సొంత లాభాలు పక్కన పెట్టి.. నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి.. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి. కావాలంటే విజయవాడ–గుంటూరు మధ్య ఎన్హెచ్ దగ్గర్లో నాగార్జున యూనివర్సిటీలోనో, లేదంటే విజయవాడ–గుంటూరు మధ్య ఓ 500 ఎకరాలు తీసుకుని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్లు ఏవో కట్టు. రీజనబుల్గా ఏదో సైజ్లో అయిపోతుంది. గుంటూరు–విజయవాడ ఎప్పుడైనా కలిసిపోతాయి.
» ఇప్పటికే నువ్వు చేసిన పనికి విజయవాడ, గుంటూరుల్లో రియల్ ఎస్టేట్ ఢమాలైంది. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. మచిలీపట్నంలో పోర్టు కట్టాం. మెడికల్ కాలేజీ నిర్మించాం. విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని కడితే రేట్లు పెరుగుతాయి.
అప్పుల సామ్రాట్ చంద్రబాబు
» మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రూ.67,720 కోట్ల అప్పులు చేస్తే.. ఈ పెద్దమనిషి 12 నెలల కాలంలో, ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులు ఏకంగా రూ.81,597 కోట్లు. అది మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది చేసిన అప్పుల కన్నా 30 శాతం ఎక్కువ. ఇంకా మూల «ధన వ్యయం చూస్తే, మా హయాంలో చివరి ఏడాది ఆ మొత్తం రూ.23,330 కోట్లు కాగా, చంద్రబాబు ఏడాది పాలనలో అది కేవలం రూ.19,177 కోట్లు. అంటే మైనస్ 17.80 శాతం అన్నమాట. ఈ గణాంకాలన్నీ చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి.
» చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ (పవర్ సెక్టార్ నాన్ గ్యారెంటీ అప్పులు సహా) అన్నీ కలిపి ఉన్న అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే మా హయాంలో చేసిన అప్పులు రూ.3,32,671 కోట్లు.
» మా హయాంలో అప్పుల పెరుగుదల (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్–సీఏజీఆర్) 13.57 శాతం. అదే అంతకు ముందు రాష్ట్రం విడిపోయి 2014లో చంద్రబాబునాయుడు చేతికి అధికారం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,40,717 కోట్లు కాగా, ఐదేళ్లలో ఆ మొత్తం ఏకంగా రూ.3,90,247 కోట్లకు చేరింది. అంటే చంద్రబాబు తన హయాంలో రూ.2,49,350 కోట్ల అప్పులు చేసి, ‘అప్పుల సామ్రాట్’ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన హయాంలో సీఏజీఆర్ 22.63 శాతంగా నమోదైంది.
» 2019–24 మధ్య ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొత్తం రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబు కేవలం ఈ 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పు చేశారు. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో ఏకంగా 41 శాతం.. చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే చేశాడు.
అప్పుల వివరాలు ఇలా..
ఎస్డీఎల్ ఇన్స్యూరెన్స్ ఇన్ ఏప్రిల్–2025 : రూ.5750 కోట్లు
ఎస్డీఎల్ ఇన్స్యూరెన్సెస్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే–2025 : రూ.7 వేల కోట్లు
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏపీపీఎఫ్సీ: రూ.710 కోట్లు
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మార్క్ఫెడ్: రూ.6 వేల కోట్లు
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్: రూ.2 వేల కోట్లు
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏపీఎండీసీ బాండ్స్: రూ.3,489 కోట్లు
బారోయింగ్స్ సెక్యూర్డ్ ఫర్ అమరావతి బై ఏపీ గవర్నమెంట్ : రూ.31 వేల కోట్లు
మొత్తం అప్పు : రూ.1,37,576 కోట్లు. ఇందులో ఒక్క అమరావతి నిర్మాణం కోసం చేసిన అప్పు రూ.31 వేల కోట్లు.
అప్పు కోసం రాజ్యాంగ ఉల్లంఘన
» చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్న 436 గనులపై ఉన్న హక్కులను ఏపీఎండీసీకి తీసుకొచ్చి, ఆ విలువను రూ.1.91 లక్షల కోట్లుగా వెల కట్టి, వాటిని తాకట్టు పెట్టి, బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నాడు.
» రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. అలాంటిది రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు ఇలా హక్కులు కల్పించడం రాష్ట్ర చరిత్రలో కాదు.. దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు. ఇది చట్టరీత్యా నేరం. రాజ్యాంగ ఉల్లంఘనే.
» ఆ విధంగా ఏపీఎండీసీ భవిష్యత్తును చంద్రబాబు అంధకారమయం చేస్తున్నాడు. ఏకంగా ఏపీఎండీసీని తాకట్టుపెట్టి అప్పులు తీసుకుని వచ్చి ఆ అప్పుల్ని డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండీసీని శాశ్వతంగా అప్పుల ఊబిలోకి నెట్టే కార్యక్రమం దగ్గరుండి చేస్తున్నాడు. అలా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు అజమాయిషీ ఇస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏపీఎండీసీని ప్రైవేటుపరం చేసే పని చేస్తున్నారు.
అసలు వీరు మనుషులేనా?
ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం
» మన ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తున్నా ఈనాడు వక్రభాష్యం చెబుతోంది. ‘సెకీ’ ఒప్పందానికి సన్మానం అని కథనం. సెకీ చైర్మన్ను తొలగించడానికి కారణం, జగన్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం అట! ఏపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం డిసెంబర్ 1, 2021 కాగా, ఇప్పుడు తొలగించిన సెకీ సీఎండీ జూన్ 13, 2023లో నియమితులయ్యారు. రామేశ్వర్ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి 2023లో సీఎండీగా వచ్చారు.
అంతకు రెండేళ్ల ముందు మా ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆయన్ను తీసేస్తే మా ప్రభుత్వంతో ఏం సంబంధం? ఇదెలా ఉందంటే.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది. దీన్నిబట్టి ఈనాడు స్థాయి టాయిలెట్ పేపర్కు ఎక్కువ.. టిష్యూ పేపర్కు తక్కువ అనిపిస్తుంది. అసలు వీరు మనుషులేనా? అంతా మాఫియా రాజ్యం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి.
» రాష్ట్రంలో స్కామ్లు దారుణంగా జరుగుతున్నా, ఎల్లో మీడియాలో అస్సలు కనిపించవు. ఉర్సా కంపెనీ. ఊరూ పేరూ లేదు. అలాంటి సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నారు. దానికి కేబినెట్లో క్లియర్ చేశారు. ఆ కంపెనీ యజమాని నారా లోకేశ్కు స్నేహితుడు. ఇంకా లులూ సంస్థకు మాల్ కట్టడానికి రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇస్తున్నారు. దాన్ని ఎల్లో మీడియా చూపదు. రాయదు.
ఈ రోజు రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, సిలికా, మైనింగ్, క్వార్ట్జ్ ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ. ఇసుకను మొత్తం దోచేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. మేము దిగిపోయే ముందు వర్షాకాలం వస్తోందని 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ పెడితే, చంద్రబాబు అండ్ గ్యాంగ్ రెండు నెలల్లో మొత్తం దోచేసింది.
సెకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం యూనిట్ విద్యుత్ను రూ.2.49కు కొనుగోలు చేస్తూ 2021, డిసెంబర్ 1న ఒప్పందం చేసుకుంటే.. సెకీ ఎండీగా రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను 2023, జూన్ 13న కేంద్రం నియమించింది. ఈ లెక్కన సెకీతో వైఎస్సార్సీపీ కుదుర్చుకున్న ఒప్పందం వల్లే రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఎండీ పదవి నుంచి తొలగించిందనేది కేవలం దుష్ప్రచారం.