సంఘీభావ పాదయాత్రలకు నీరాజనం

YSRCP Leaders Solidarity Padayatra Across AP - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న సంఘీభావ పాదయాత్రలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం కూడా  దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ నేతలు ప్రజాచైతన్య యాత్రల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ‘ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు’ పేరిట సాగిన కార్యక్రమంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఏలూరు రూరల్‌ పోణంగిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని.. ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో కలిసి ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు నీరాజనం పలికారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరులో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఇంటింటికీ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాదయాత్రలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ రవీంద్ర, మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌ తోట త్రిమూర్తులు పాదయాత్ర చేశారు. కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి చెల్లుబోయిన వేణు, అల్లవరం మండలంలో ఎంపీ అనురాధ, మంత్రి పినిపే విశ్వరూప్‌ పాల్గొన్నారు.

కృష్ణా, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్రలు, ర్యాలీలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పాదయాత్ర నిర్వహించారు. జి.సిగడాం మండలం చంద్రయ్యపేట, వెలగాడ, దేవరవలసల్లో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పాదయాత్ర చేశారు.

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పందిపర్తిలో మంత్రి శంకర నారాయణ పాదయాత్ర నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతిల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top