
సాక్షి, కాకినాడ జిల్లా: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అత్యవసరం అయితే కాకినాడ నుండి హైదరాబాద్కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఎయిర్ లిఫ్ట్కు సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు. అస్వస్థత నుండి ముద్రగడ కోలుకుంటున్నారు. ఆయన్ని వైఎస్సార్సీపీ నేతలు చిర్ల జగ్గిరెడ్డి, వంగా గీతా పరామర్శించారు.
ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ అహోబిలం ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
