బాలాజీ చెరువు (కాకినాడ సిటీ) : ప్రస్తుత విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ కాకినాడ పరిధిలో అనుబంధంగా ఉన్న 103 కళాశాలల్లో ఇంజినీరింగ్ అడ్మిషన్ల నిమిత్తం 84,800 సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతిచ్చారు. అలాగే, జేఎన్టీయూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి మరిన్ని సీట్ల పెంపుదలకు కూడా అనుమతి వచ్చింది. సీఎస్ఈ, మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సివిల్ వంటి విభాగాల్లో ఇప్పటివరకు ఒక్కో విభాగానికి ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 55 సీట్లు మాత్రమే ఉండేవి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి కొత్తగా వచ్చిన అనుమతితో ఒక్కో సెక్షన్కు 60, ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆరు సీట్లు కలిపి మొత్తం 66 చొప్పున అన్ని విభాగాల్లో రెండు సెక్షన్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్కో కోర్సుకు రెండు సెక్షన్లు ఉంటాయి.
ఉన్నత విద్యా మండలికి నివేదిక
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యామండలికి నివేదిస్తేనే అక్కడి నుంచి ఆన్లైన్లో కళాశాలల వివరాలు విద్యార్థులకు కనబడతాయి. రాష్ట్రంలో అత్యధిక కళాశాలలకు అనుబంధంతో పాటు సాంకేతిక వర్సిటీలో కీలకంగా ఉన్న జేఎన్టీయూకే ఈ ప్రక్రియ పూర్తిచేసి ఉన్నత విద్యా మండలికి నివేదిక పంపించింది. ఇక ఈ నెల 21 నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా.. కళాశాల, కోర్సు ఎంపికకు కీలకమైన వెబ్ ఆప్షన్లకు ఈనెల 31 వరకు అవకాశముంది.
ఉన్నత ప్రమాణాలున్న కళాశాలలకే..
ఉన్నత విద్యా మండలి సూచనల మేరకే సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు ఉన్న కళాశాలలకే గుర్తింపు ఇచ్చాం. అటువంటి కళాశాలలో అభ్యసిస్తే విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి.
–డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్, జేఎన్టీయూకే
అదనంగా మరో సెక్షన్ ఏర్పాటు
జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఏడాది అన్ని విభాగాల్లో సీట్లు పెంచి కొత్తగా మరో సెక్షన్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో మరింత మంది విద్యార్థులు కళాశాలలో చేరడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన ర్యాంకు ఆధారంగా అర్హులైన వారు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి.
– కొప్పిరెడ్డి పద్మరాజు, ప్రిన్సిపాల్, యూసీఈకే కళాశాల
ఫ జేఎన్టీయూకే పరిధిలో సీట్లు ఖరారు
ఫ మొత్తం 103 కళాశాలలకు గుర్తింపు
ఫ 31 వరకు కళాశాల,
కోర్సు ఎంపికకు వెబ్ ఆప్షన్లు


