కొత్తపల్లి: కడలి కల్లోలంగా మారింది. కెరటాల ఉధృతి పెరిగింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉప్పాడ, కోనపాపపేట తీర ప్రాంతాల్లో కెరటాలు ఎగసి పడుతున్నాయి. ఇప్పటికే కెరటాల తాకిడికి ఉప్పాడ– కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. బీచ్ రోడ్డులో రక్షణ గోడగా వేసిన బండరాళ్లు సైతం కెరటాల ఉధృతికి రోడ్డుపైకి వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. మత్య్సకారులు వేటకు వెళ్లరాదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
పీజీఆర్ఎస్కు 343 అర్జీలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద హాలులో సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ ఎం.హరేంధిర ప్రసాద్ అర్జీలను స్వీకరించారు. మొత్తం 343 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యలను అధికారులు ఓపిగ్గా విని పరిష్కారానికి కృషి చేయాలన్నారు.


