నెలల తరబడి వేతనాలు అందక కడుపు మాడ్చుకుంటున్న కూలీలు
అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతోనే ఈ దుస్థితి
చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు
ఎంజీఎన్ఆర్ఈజీఏ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం
ఈ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేయడంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ ఒకటిగా ఉండేది.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో ఏపీ పూర్తిగా వెనుకబడి పోయింది
ఫలితంగా గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది
ఉపాధి పొందిన కుటుంబాలు, వ్యయం వివరాలే ఇందుకు నిదర్శనం
సాక్షి, అమరావతి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద పనులు చేసిన కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల పేదల కడుపులు మాడిపోతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.

2023–24తో పోల్చితే 2025–26లో రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన ఉపాధి పనులు, వేతనాల వృద్ధి రేటు వివరాలు
‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చరిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏను అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకబడి పోయింది.
ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధన దాహం, అవినీతి వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రభుత్వ తీరును కడిగి పారేశారు.


