చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు | YS Jagan Comments on CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు

Apr 22 2026 5:23 AM | Updated on Apr 22 2026 5:23 AM

YS Jagan Comments on CM Chandrababu

అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు భయపడుతున్నారు

ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి?  

సీఎంను సూటిగా ప్ర శ్నించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ 

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా?  

హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తారా? 

అతన్ని డిస్మిస్‌ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా.. 

సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు 

మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడు అశోక్‌బాబు బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? 

మరి అతన్ని ఎందుకు డిస్మిస్‌ చేయలేదు?  

అంటే మీ వాళ్లకు ఒక న్యాయం.. పక్క వాళ్లకు మరో న్యాయమా?   

ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు.. ఇది జంగిల్‌ రాజ్‌ కాదా?  

మీ కక్ష సాధింపులు, ఒత్తిడులతో 250 మంది సచివాలయ ఉద్యోగుల ఆకస్మిక మరణం నిజం కాదా?    

సాక్షి, అమరావతి: ‘మీరు తప్పు చేస్తున్నారు.. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావిురెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్‌ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా..’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారంటూ ఎత్తిచూపారు. ‘మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడిగా ఉన్న అశోక్‌బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్‌ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా?’ అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

‘‘చంద్రబాబు గారూ.. ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయపడి పోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు సైతం ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా.. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం?

 ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? రూ.3.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా.. మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా..

 ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావిురెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని ప్రయోగించి, అతన్ని డిస్మిస్‌ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా.. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్‌ డీఏలు, పీఆర్సీ, మీరు వసూ్తనే ఇస్తామన్న ఐఆర్‌ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే కదా.. ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తున్నారు.

 సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా అర్థం?

 ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు. ఇది జంగిల్‌ రాజ్‌ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్‌ చేస్తామని వలంటీర్లకు మాట ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదే కదా? మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిళ్లకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా?  

చంద్రబాబు గారూ.. సూటిగా ఒక ప్రశ్న. మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్‌ అధ్యక్షుడిగా ఉన్న అశోక్‌ బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్‌ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా? చంద్రబాబు గారూ.. మీరు తప్పు చేస్తున్నారు. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు, భయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement