భార్య వివరాలు అడిగిందని.. ప్రియురాలు దారుణ హత్య! | Young Man Arrested After Murdering Girlfriend And Fleeing Guntur District | Sakshi
Sakshi News home page

భార్య వివరాలు అడిగిందని.. ప్రియురాలు దారుణ హత్య!

Jun 28 2026 2:22 PM | Updated on Jun 28 2026 2:49 PM

Young Man Arrested After Murdering Girlfriend And Fleeing Guntur District

గుంటూరు, నగరంపాలెం: మూడేళ్లుగా సహజీవనం చేసిన మహిళ గొంతు నులిమి చంపిన కేసులో నిందితుడిని దుగ్గిరాల పోలీసులు అరెస్ట్‌ చేశారని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ఈ నెల 8వ తేదీన దుగ్గిరాల పాత లాకుల వద్ద కాల్వ కట్టపై గుర్తు తెలియని ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

పది రోజుల క్రితమే ఆమె మృతి చెందినట్లు తేల్చారు. తెనాలి జీజీహెచ్‌ శవాగారానికి మృతదేహాన్ని తరలించారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి ఆమెను హత్య చేసినట్లు వెల్లడైంది. ఉత్తర డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణ పర్యవేక్షణలో మంగళగిరి గ్రామీణ సర్కిల్‌ పీఎస్‌ సీఐ ఏవీ బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్‌ ఎస్‌ఐ వెంకట రవి దర్యాప్తు చేశారు. లుక్‌ అవుట్‌ నోటీసులను అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపించారు. తిరుపతి జిల్లా గాజుల మండ్యం పీఎస్‌లో మహిళ అదృశ్యం కేసు నమోదైంది.

మృతదేహం వద్ద ఆధారాలతో మృతురాలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పద్మానగర్‌ కుర్రాకాల్వకి చెందిన మీనాటి మేనక (40)గా గుర్తించారు. మేనక కుటుంబ సభ్యులను దుగ్గిరాల పోలీసులు పిలిచి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసులో బాపట్ల జిల్లా వెల్లబాడు గ్రామం వాసి వల్లభాపురం చిరంజీవి(25)ని శుక్రవారం నందివెలుగు సెంటర్‌లో అరెస్ట్‌ చేశారు. అతని నుంచి మొబైల్‌ఫోన్‌, లగేజీ, హ్యాండ్‌ బ్యాగ్‌లు, నకిలీ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పథకం ప్రకారమే దారుణం..
చిరంజీవి మూడేళ్లుగా తిరుపతి ఓ ప్రైవేట్‌ కంపెనీలో రుణాలు రికవరీ చేసే విధులు నిర్వహిస్తున్నాడు. మేనక సైతం లోన్లకు సంబంధించి పనిచేసేది. మూడేళ్లుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. చిరంజీవికి రెండు నెలల క్రితం మరో యువతితో వివాహమైంది. పెద్దలు పంచాయితీ చేసి... రూ.ఐదు లక్షలు మూడు విడతలుగా మేనకకు చెల్లించేలా ఒప్పందం చేశారు. గత నెల 29వ తేదీన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరూ రోజంతా గడిపారు.

భార్య వివరాలు చెప్పాలని చిరంజీవిని మేనక నిలదీయడంతో వాదన చోటుచేసుకుంది. రాత్రికి ఇద్దరు ఆటోలో దుగ్గిరాల పాత లాకుల వద్ద కాలువ కట్టకు చేరారు. మళ్లీ వాగ్వాదం జరిగింది. ముందస్తు పథకంతో చిరంజీవి ఆమె గొంతు నులిమి, తలపై బండరాయితో మోది హత్య చేశాడు. సాంకేతిక ఆధారాలతో చిరంజీవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసును ఛేదించిన మంగళగిరి గ్రామీణ పీఎస్‌ సీఐ ఏవీ.బ్రహ్మం, దుగ్గిరాల పీఎస్‌ ఎస్‌ఐ వెంకట రవి, పోలీస్‌ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement