
దత్తత కోసం అనాథ చిన్నారుల ఎదురుచూపులు
చట్టప్రకారం జరిగితేనే దత్తత హక్కులు వర్తిస్తాయి
బిడ్డను దత్తత ఇవ్వాలంటే తల్లిదండ్రుల సమ్మతి ఒక్కటే సరిపోదు
ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా ఇచ్చినా దత్తత హక్కులు వర్తించవు
అమితమైన ప్రేమ అమ్మ. అంతులేని అనురాగం అమ్మ. అమ్మ ప్రాణం పోసి జీవమిస్తే.. ఆ ప్రాణానికి ఓ రూపు ఇచ్చి వ్యక్తిగతంగా వృద్ధిలోకి తెచ్చే వ్యక్తి నాన్న. ఈ ఇద్దరికీ దూరమై ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారిపోతున్నారు. అల్లారుముద్దుగా పెరగాల్సిన వారు దిక్కుమొక్కులేకుండా జీవిస్తున్నారు. అలాంటి వారు తమకూ అమ్మానాన్న కావాలని, అందరి పిల్లల్లా తామూ వారి ప్రేమకు నోచుకోవాలని ఎదురుచూస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనాథ పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా చాలామంది గర్భం దాల్చడం, ప్రసవం కాగానే ముళ్లపొదల్లోనో, నిర్మానుష్య ప్రదేశాల్లోనూ పసికందులను వదిలి వెళుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. పేగు బంధాన్ని కాదనుకుని సమాజానికి భయపడి చేస్తున్న ఈ ఘటనలు కలచి వేçస్తుంటాయి. కానీ ఇలాంటి పిల్లలను అక్కున చేర్చుకునేందుకు దత్తతకు ముందుకు రావాలనేది అందరి అభిప్రాయం.
దత్తత చట్టప్రకారమే జరగాలి..
దత్తత అనేది పుట్టగానే ఎవరి బిడ్డనో ఆ తల్లిదండ్రుల సమ్మతితో తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు. చట్ట ప్రకారమే జరగాలి. దత్తత కావాలనుకునే తల్లిదండ్రులు తమ పాన్కార్డు ద్వారా www.cara. nic. in (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనికోసం దంపతులు పాన్కార్డు, ఆదాయ, వయస్సు, నివాస, వివాహ, ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలతో పాటు దంపతుల ఫొటో వెబ్సైట్కు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఏజెన్సీకి రూ.6 వేలు డీడీ సమరి్పంచాలి. ఇవన్నీ పూర్తయ్యాక 48 గంటల లోగా దంపతుల మొబైల్కు సమాచారం వస్తుంది. అనంతరం ఏజెన్సీకి వెళ్లి బిడ్డను రిజర్వు చేసుకోవచ్చు.
బిడ్డ నచ్చిన తర్వాత..
బిడ్డ నచ్చిన తర్వాత రిజర్వు చేసుకొని, రూ.40 వేలు ఏజెన్సీకి చెల్లించాలి. అన్ని ధ్రువపత్రాలు పరిశీలించిన తర్వాత బిడ్డను అప్పగిస్తారు. బిడ్డను పొందిన వారం రోజుల్లోగా దత్తతకు వచ్చిన డాక్యుమెంట్లన్నీ స్థానిక ఫ్యామిలీ కోర్టు లేదా జిల్లా మెజి్రస్టేట్ కోర్టులో సమరి్పంచి దత్తతకు అధికారిక ఉత్తర్వులు పొందే అవకాశం ఉంటుంది. శిశు గృహతో పాటు సీసీఐ (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్)లో ఉన్న వారినీ దత్తత చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శిశుగృహలు, బాలల సంరక్షణ సంస్థ(సీసీఐ)ల్లో ఉంటున్న దాదాపు వంద మంది చిన్నారులు దత్తత కోసం ఎదురుచూస్తున్నారు.
రెండేళ్ల పాటు బిడ్డ పరిశీలన..
దత్తత తీసుకున్న దంపతులు బిడ్డను తీసుకెళ్లాక.. దత్తత ఏజెన్సీకి చెందిన ప్రతినిధి రెండేళ్ల పాటు బిడ్డను ప్రతి ఆరు మాసాలకోసారి పరిశీలిస్తారు. బిడ్డకేమైనా ఇబ్బందులున్నాయా, తల్లిదండ్రులు సరిగా చూసుకుంటున్నారా లేదా ఇవన్నీ పరిశీలించి జాతీయ దత్తత ఏజెన్సీ ‘కారా’కు సమరి్పస్తారు.
శిశువుల పట్ల ఔదార్యం ఉండాలి
ఎంతోమంది అనాథ చిన్నారులు ఆసరా కోసం ఎదురుచూస్తున్నారు. చాలామంది సంతానం లేని జంటలు ఇలాంటి బిడ్డలను దత్తత తీసుకుని తల్లిదండ్రులు కావచ్చు. సంతానం లేకపోవడం శాపం కాదు.. దత్తత చేసుకోవడం ఒక వరం. శిశువుల పట్ల ఔదార్యం కలిగి ఉండాలి.
– తరిమెల రమణారెడ్డి, అమ్మ ట్రస్ట్ చైర్మన్