సాక్షి, అనకాపల్లి: ‘గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడకపోయి ఉంటే.. నా భర్త నా బతికుండేవాడు’ అంటూ పరవాడలోని దక్షిణ ఎనర్జీ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు వేపాడ వెంకటేష్ భార్య కోమలి కన్నీరుమున్నీరైంది. తన భర్త గతంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడని, ఆ ఫ్యాక్టరీ మూతపడడంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని చెప్పింది.
కుటుంబ పోషణకు మరో దారి లేక మూడు నెలల క్రితమే పరవాడలోని దక్షిణ ఎనర్జీ ఫార్మా సంస్థలో చేరాడని తెలిపింది. ఆ ఉద్యోగమే తన భర్త ప్రాణాలను బలిగొంటుందని ఊహించలేకపోయానని కన్నీటిపర్యంతమైంది. తనతో పాటు ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం మారిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ గుండెలవిసేలా కోమలి రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది.
సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం
ఇంత ప్రమాదం జరిగి, తన భర్త చనిపోయి నా..కంపెనీ యాజమాన్యం తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదంటూ ఆమె వాపో యింది. ఎప్పటిలాగే ఈరోజూ ఉదయం 6 గంటలకు తన భర్త క్షేమ సమాచారం తెలుసుకుందామని ఫోన్ చేశానని, కానీ ఎంతసేపటికీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పింది. చాలాసార్లు ప్రయతి్నంచగా, చివరికి ఒక కానిస్టేబుల్ ఫోన్ ఎత్తి, కంపెనీలో ప్రమాదం జరిగిందని చెప్పి ఫోన్ పెట్టేశాడని ఆమె వాపోయింది.
అప్పటికే వెంకటేష్ చనిపోయినా ఆ విషయాన్ని యాజమాన్యం కానీ, అక్కడి వారు కానీ చెప్పకుండా దాచారని తెలిపింది. తమకు సమాచారం ఇవ్వడంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. వెంకటేష్ కోమలి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద పాపకు ఆరేళ్లు, రెండో పాపకు మూడేళ్లు, చిన్న పాపకు ఏడాదిన్నర మాత్రమే.నాన్న ప్రేమను పూర్తిగా చవిచూడని పసి వయసు వారిది. వెంకటేష్ మృతితో ఆ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంగా మారిందని కోమలి ఆవేదన వ్యక్తం చేసింది.


