కల్యాణమస్తుకు త్వరలో ముహూర్తం

TTD EO Jawahar Reddy Comments About Kalyanamasthu - Sakshi

టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి

తిరుమల: టీటీడీ త్వరలో నిర్వహించనున్న కల్యాణమస్తు సామూహిక వివాహాల నిర్వహణకు అర్చక స్వాములతో చర్చించి ముహూర్తాలను ఖరారు చేయవలసిందిగా టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ప్రతి శనివారం శ్రీవేంకటేశ్వర వ్రత కల్పం నిర్వహించేందుకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక అందగానే శ్రీవేంకటేశ్వర వ్రత కల్పం ప్రారంభిస్తామని తెలిపారు.

ఇప్పటికే టీటీడీ అనుబంధ ఆలయాల్లో గోపూజ ప్రారంభించామని, మిగిలిన ఆలయాల్లో కూడా గోపూజ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర దేవదాయ శాఖ ఆధీనంలోని 6ఎ, 6బి ఆలయాల్లో కూడా గో పూజ ప్రారంభించాలన్నారు. ప్రైవేట్‌ ఆలయాల్లో గోపూజ ప్రారంభించాలనుకునే వారికి కోరిన వెంటనే గోమాతను అందిస్తామన్నారు. సనాతన ధార్మిక పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు విద్యార్థులకు పుస్తకాలను అందించాలని ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top