ఒంటిమిట్ట: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. గత అర్ధరాత్రి ఎస్సీ కులానికి చెందిన హర్షవర్ధన్ పై మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. 10 మంది టీడీపీకి చెందిన నాయకులు దాడి చేసి హర్షవర్థన్ను తీవ్రంగా గాయపరిచారు. నోట్లో గుడ్డలు కుక్కి మరీ తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు హర్షవర్థన్ పేర్కొన్నాడు. తనపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పారిపోయారన్నాడు.
ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ను 108 అంబులెన్స్లో హుటాహుటిన కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు బంధువులు. దాడికి సంబంధించి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. తమకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటున్నారు బాధితులు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేయకుంటే ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. అవసరమైతే రాస్తారోకో చేసేందుకైనా వెనుకాడమని హెచ్చరికలు పంపాయి.


