ఆ తల్లికి 21 మంది పిల్లలంట!!! | Strange thing is coming to light every day in talliki vandanam scheme | Sakshi
Sakshi News home page

ఆ తల్లికి 21 మంది పిల్లలంట!!!

Jun 16 2025 3:55 AM | Updated on Jun 16 2025 3:55 AM

Strange thing is coming to light every day in talliki vandanam scheme

జాబితాలోని ఒక పేజీలో ముగ్గురు పిల్లలకు తల్లిగా భావన పేరు పొందుపరిచిన దృశ్యం

తల్లికి వందనం జాబితాలో విచిత్రం 

లబ్ధిదారుల జాబితాలో 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా ప్రస్తావన

పుట్టపర్తి అర్బన్‌: ఆమె వయసు 35 ఏళ్లలోపే. కానీ 21 మంది పిల్లలు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. నిజమనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది తల్లికి వందనం జాబితాలో చోటుచేసుకున్న వైచిత్రి. ఇంతకీ ఏం జరిగిందంటే... తల్లికి వందనం పథకంలో రోజుకో విచిత్రం వెలుగు చూస్తోంది. వివరాల నమోదులో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా సూచిస్తూ జాబితాలో ప్రదర్శించిన వైనం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి సచివాలయం–1 పరిధిలో చోటుచేసుకుంది. 

పెడపల్లి సచివాలయం–1లో తల్లికి వందనం పథకం కింద అర్హుల జాబితాను ఈ నెల 13న ప్రదర్శించారు. 458 మంది పిల్లలకు రూ.13వేలు చొప్పున జమ చేస్తున్నట్టుగా 15 పేజీలతో కూడిన జాబితా ప్రదర్శించారు. ఇందు­లో భావన అనే మహిళ పేరు, ఆధార్‌ నంబరును 21 మంది విద్యార్థులకు తల్లిగా సూచించారు. దీంతో జాబితాను చూసినవారంతా అవాక్కవుతున్నారు. 

వాస్తవానికి ఆమెకు తొమ్మిది, ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగిలిన 19 మంది పిల్లలు ఇతరులకు చెందినవారు. వారికి ఈమెను తల్లిని చేసేశారు. ఇది ఎలా జరిగిందో.. ఎవరి నిర్లక్ష్యం వల్ల తప్పుగా నమోదు చేశారో తెలియదు కానీ.. జాబితా చూసిన వారంతా నవ్వుకుంటున్నారు.  

35 ఏళ్ల ఆమెకు 21 మంది పిల్లలా?  
భావనకు ప్రస్తుత వయసు 35 ఏళ్లలోపే. కాగా ఆమెకు పిల్లలు 21 మంది ఎలా ఉంటారు? కనీస అవగాహన లేదా? అని అధికార యంత్రాంగంపై స్థానికులు మండిపడుతున్నారు. రెండో శనివారం, ఆదివారం కావడంతో సచివాలయం, పాఠశాలల తలుపులు తెరవలేదు. ఎవరిని అడగాలో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement