నా భర్త డ్యూటీలోనే మృతి చెందినా పైసా ఇవ్వలేదు | Steel plant management not providing compensation | Sakshi
Sakshi News home page

నా భర్త డ్యూటీలోనే మృతి చెందినా పైసా ఇవ్వలేదు

Jun 11 2026 4:50 AM | Updated on Jun 11 2026 4:51 AM

Steel plant management not providing compensation

స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం పరిహారం అందించడం లేదు  

వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లిన మృతుని భార్య దుంగ మల్లేశ్వరి  

సాక్షి, విశాఖపట్నం: ‘‘నా భర్త దుంగ గోపాలకృష్ణ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా ఎనిమిదేళ్లపాటు పనిచేశారు. గత ఏడాది నవంబర్‌ 25న విధి నిర్వహణలో ఉండగానే ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆయన పీఎస్‌వో విభాగంలో పనిచేస్తుండగా, ఆ రోజు ఎస్‌ఎల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని కార్మికులు సెలవులో ఉండటంతో అక్కడ విధులు నిర్వహించేందుకు పంపించారు. అండర్‌ గ్రౌండ్‌లో పని చేస్తుండగా బాయిలర్‌ వేడి నీరు పడటంతో ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో ఉండగానే మరణించినప్పటికీ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు.

కాంట్రాక్టర్‌ నాగేశ్వరరావు రూ.1 లక్ష ఇస్తానని చెప్పి, కేవలం రూ.50 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన మొత్తాన్ని చెల్లించలేదు’’ అని దుంగ మల్లేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాది వడ్లపూడి వేటపాలెం. నాకు ఆరేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. నా కుమారుడు పూర్తిగా దివ్యాంగుడు కావడంతో అతడిని చూసుకోవాల్సి రావడంతో పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. కుటుంబ పోషణ ఎంతో కష్టంగా మారింది. 

నా భర్త మృతికి నష్టపరిహారం ఇవ్వాలని పలుమార్లు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యాన్ని కోరినా స్పందన లేదు. నాకు మీరే న్యాయం చేయాలి జగనన్న‘ అంటూ విశాఖలో కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రి వద్ద దుంగ మల్లేశ్వరి తన గోడును వినిపించారు. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని, అయినప్పటికీ పరిహారం అందకపోతే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

జగన్‌ రాకతో..ఉరుకులు పరుగులు!
ఉదయాన్నే బాధితుల ఇళ్ల వద్దకు కూటమి నేతలు 
నయాపైసా పరిహారం ప్రకటించకుండా డ్రామాలు 
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాద బాధిత కుటుంబాలకు పైసా పరిహారం ప్రకటించని చంద్రబాబు సర్కారు మరో డ్రామాకు తెర తీసింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ వస్తున్నారని తెలిసిన వెంటనే కూటమి నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ పెద్దల ఆదేశాలతో కూటమి నేతలు బాధితుల ఇళ్ల వద్ద వాలిపోయారు. బాధితులకు ఏదో మేలు చేసేస్తామన్న బిల్డప్‌ ఇచ్చారు. 

కానీ కార్మికులకు హక్కుగా రావాల్సిన పరిహారం మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా నయా పైసా చెల్లిస్తామని చెప్పేందుకు కూటమి నేతలు సాహసించలేదు. మరోవైపు కార్మికులు, కార్మిక సంఘాలతో కేజీహెచ్‌ వద్ద మంత్రి లోకేశ్‌ మంగళవారం వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూటమి నేతలను రంగంలోకి దించినట్లు చర్చ జరుగుతోంది.  

ఆగమేఘాలపై పోస్టుమార్టం..! 
సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించిన పైడిరాజు మృతదేహాన్ని హడావుడిగా కేజీహెచ్‌ నుంచి తరలించారు. ఉదయం 8.30 గంటల సమయంలో పైడి రాజు మరణించగా 10 గంటలకే పోస్టుమార్టం ముగించి ఆగమేఘాలపై అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించడం గమనార్హం.  

కార్మికుల ఘోష పట్టించుకోకుండా.. 
ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలపై కూటమి సర్కారు కనీసం స్పందించడం లేదని కార్మికులు మండిపడుతున్నారు. 6 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిన సమయంలో కూటమి నేతల ఇళ్ల వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నా స్పందించలేదు. కార్మికులను తొలగించకుండా చూడాలని సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా వేడుకున్నా ఆలకించలేదు. స్టీలు ప్లాంట్‌లో సమస్యలపై మాట్లాడిన నేతలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

ఇక వీఆర్‌ఎస్‌ పేరుతో బలవంతంగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వారికి బెనిఫిట్స్‌ కూడా చెల్లించకపోవడంపైనా కూటమి నేతలు నోరు విప్పలేదు. ఏకంగా నాలుగున్నర నెలల పాటు వేతనాలు అందడం లేదంటూ కార్మికులు, ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నా కూటమి ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ప్రతి సందర్బంలోనూ వైఎస్సార్‌సీపీ వారికి అండగా నిలిచి విశాఖ ఉక్కు కార్మికుల గుండె ఘోషను ఎలుగెత్తింది.  

Advertisement
 
Advertisement
Advertisement