
విశాఖ ఐటీ సెజ్లో ఉర్సాకు కేటాయించిన భూముల వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులు
భూములు రద్దు చేయకుంటే ప్రజా ఉద్యమం
విశాఖ ఐటీ హిల్స్లో వివిధ పార్టీలు, సంఘాల ఆందోళన
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
సాక్షి, అమరావతి/మధురవాడ(విశాఖ): ఊరూపేరూ లేని, కనీసం అడ్రస్ కూడా లేని ఉర్సా(Ursa) క్లస్టర్స్ అనే ఉత్తుత్తి కంపెనీకి విశాఖ ఐటీ సెజ్ మధురవాడ హిల్–3లో రూ.3 వేల కోట్ల విలువైన భూములు కేటాయించడంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. ఈ భూకేటాయింపులను రద్దు చేయకపోతే తీవ్ర నిరసన తప్పదని హెచ్చరించాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
లేకపోతే విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల అధ్వర్యంలో ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరించాయి. ఉర్సాకు కేటాయించిన భూముల్లో బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఖబడ్దార్ లోకేశ్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, ప్రభుత్వ భూములను రక్షించాలంటూ నేతలు నినదించారు.
భూముల ధారాదత్తం ఆపాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
ఊరూపేరూ లేని ఉర్సా క్లస్టర్స్కు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలి. ఐటీలో ఎలాంటి అనుభవం, చరిత్ర లేని, నిన్నమొన్న ప్రారంభించిన కంపెనీకి ఉచితంగా 60 ఎకరాలు ఎలా కట్టబెడతారు?
డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు భూ కేటాయింపు తగదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కేటాయించడం తగదు. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ భూములు ధారాదత్తం చేయడం సరికాదు. రెండు నెలల క్రితం హైదరాబాద్లో ఉత్పత్తి కంపెనీగా రిజిస్టరైన ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్ అనే ఒక ఐటీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో దాదాపు రూ.3వేల కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని కేవలం 99పైసలకే కట్టబెట్టడం తీవ్ర ఆక్షేపణీయం.
రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమమే..
జన జాగరణ సమితి రాష్ట్ర కన్వినర్ ఎస్ఎల్ఎన్ వాసు
ఉర్సాకు కేటాయించిన విలువైన భూములు వెంటనే రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదు. రూ.3 వేల కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని మంత్రి లోకేశ్ ఉత్తుత్తి కంపెనీకి ఎలా కట్టబెట్టే యత్నం చేస్తారు? ఇప్పటికే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కబ్జాకోరు అనే పేరుంది. ఆయన రికార్డును మంత్రి లోకేశ్ తిరగరాయాలని చూస్తున్నట్లుంది.
ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఎంత వరకైనా వెళ్లడానికి మాతోపాటు ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఉర్సా కంపెనీని రెండు నెలల క్రితమే ఏర్పాటు చేశారు. దీనికి కనీసం అడ్రస్, ఫోన్ నంబర్ కూడా లేవు. ఎక్కడా ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటి కంపెనీకి ఇంత విలువైన భూములు ఎలా ఇచ్చేస్తారు?
విశాఖ వాసులు హర్షించరు
టీసీఎస్కి 21 ఎకరాలు ఇచ్చినట్టు చూపించి దాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఉత్తుత్తి కంపెనీకి రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కారు చౌకగా ఇచ్చేస్తోంది. ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకునే ఎత్తుగడగా దీనిని మేం చూస్తున్నాం. ఇలా పంచుకుంటూ పోతే విశాఖలో భూములు మిగలవు. దీన్ని విశాఖ వాసులు హర్షించరు. ప్రభుత్వ పాలన ముగిసేలోపు మొత్తం ఖాళీ చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. – చింతపల్లి సునీల్కుమార్, విశాఖ నగర కన్వినర్
99 పైసలకే మొత్తం 21.16 ఎకరాలు
విశాఖ ఐటీ హిల్ నంబర్–3లో టీసీఎస్కు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్)కు విశాఖపట్నంలోని ఐటీ హిల్ నంబర్–3లో 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని భూమి కేటాయించాలని సూచిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐదారేళ్లలో క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి 20 నుంచి 25 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని టీసీఎస్ కోరింది.
కారు చౌకగా భూములు కేటాయించమని అడగకపోయినా ఐటీ కంపెనీల ఆకర్షణ పేరుతో మొత్తం 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకే ప్రభుత్వం అప్పగించేసింది. ఏకంగా మొత్తం అన్ని ఎకరాలు 99 పైసలకే అంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో సామాజిక మాధ్యమాల్లో మరోమారు టీసీఎస్కు భూ కేటాయింపులు పెద్ద చర్చకు దారితీశాయి.
టీసీఎస్ ముసుగులో వేరే ఇతర అనామక కంపెనీలకు కారుచౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా టీసీఎస్ భూములను ఉచితంగా ఇవ్వమని అడిగిన దాఖలాలు లేవని, ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు టీసీఎస్ బ్రాండ్పై కూడా నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉందని అంటున్నారు.