
గుంటూరు షాహీ జామియా మసీదు భూములు ఏపీఐఐసీకి బదలాయించేందుకు సర్కారు స్కెచ్
మల్లాయపాలెంలోని రూ.వందల కోట్ల విలువైన 233.18 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు పేరుతో కొట్టేసేందుకు కుట్ర
17న వక్ఫ్బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసేందుకు సీఎంవో నుంచి ఒత్తిళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వక్ఫ్ భూములపై కన్నేసింది. ఎప్పుడో 17వ శతాబ్దంలో ఓ మొఘల్ చక్రవర్తి వక్ఫ్ చేసిన వందలాది ఎకరాల భూములను ఇప్పుడు తమ అనుయాయులకు పప్పుబెల్లాల్లా కట్టబెట్టేందుకు చకచకా పావులు కదుపుతోంది. ముందుగా ఆ భూములను పారిశ్రామికాభివృద్ధి కోసమంటూ ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)కి బదలాయించి ఆ తర్వాత అస్మదీయులకు పంచిపెట్టనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 17న ఇందుకు ఆమోదముద్ర పడిపోవడం ఖాయం.
గుంటూరు లాలాపేట ప్రాంతంలో ప్రసిద్ధ షాహీ జామియా మసీదును మొఘల్ చక్రవర్తి షా ఆలం బాద్షా ఘాజీ 17వ శతాబ్దం (ముస్లిం క్యాలెండర్ 1189 హిజరీ)లో నిర్మించారు. దీని నిర్వహణ కోసం ఆయన గుంటూరు జిల్లా రెడ్డిపాలెంలో 244.34 ఎకరాలు, ప్రతిపాడు మండలం మల్లాయపాలెంలోని సర్వే నెంబర్ 232/1–ఎలో 144.79 ఎకరాలు, 232/1/సి లోని 80.25 ఎకరాలు, 232/2లో 7 ఎకరాలు, 232/8లో 1.14 ఎకరాల భూమిని వక్ఫ్ చేశారు. వీటిని 1962లో భారత ప్రభుత్వం వక్ఫ్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా గుర్తించింది. ఎంతో ఉదారంగా వక్ఫ్ చేసిన ఆ భూముల విలువ ఇప్పుడు రూ.వందల కోట్లకు పైగా పెరగడంతో వాటిని కాజేసే కుట్రలు ఊపందుకున్నాయి.
టీడీపీకి చెందిన బడా బాబులు మల్లాయపాలెంలోని 233.18 ఎకరాల భూములపై కన్నేసి అధికారికంగా వాటిని చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పెద్దలు సైతం రంగంలోకి దిగి అందుకు అవసరమైన వ్యూహాన్ని రచించారు. ఇందులో భాగంగా.. రెవెన్యూ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 22న వక్ఫ్బోర్డుకు లేఖ రాశారు. ఏపీఐఐసీకి ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా సదరు వక్ఫ్ భూమిని ఇవ్వాలని అందులో కోరారు. వక్ఫ్ అధికారులు సైతం ఆఘమేఘాలపై స్పందించి ఆ భూములను ఏపీఐఐసీకి అప్పగించేలా రంగం సిద్ధంచేశారు. ఈ మేరకు ప్రతిపాదనలు సైతం సిద్ధంచేసి ఈనెల 17న నిర్వహించే వక్ఫ్బోర్డు సమావేశానికి 42 అంశాలతో రూపొందించిన అజెండాలో 4వ అంశంగా దీనిని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుండడంతో దీని ఆమోదముద్రకు వక్ఫ్ బోర్డుపై తీవ్ర ఒత్తిడి కూడా పెరిగింది. నిజానికి.. వక్ఫ్ చట్టం–1995 ప్రకారం ఈ భూములను భూసేకరణ ద్వారా ఇతరులకు కేటాయించడం చట్ట విరుద్ధం. అయినా, వాటిని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఐఐసీ)కు అప్పగించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బరితెగించింది. ఆ తర్వాత వాటిని ఏపీఐఐసీకి బదలాయించి తద్వారా ఇండ్రస్టియల్ పార్కు పేరుతో పచ్చనేతలకు లీజు పేరుతో సమరి్పంచాలన్నది అసలు వ్యూహం.
సర్కారు తీరుపై ముస్లిం సమాజం భగ్గు
ఇక వక్ఫ్ సవరణ చట్టానికి ఓ పక్క మద్దతు పలికిన చంద్రబాబు.. మరోపక్క ఇలా రాష్ట్రంలో వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి ఊతమివ్వడంపట్ల ముస్లిం సమాజం మండిపడుతోంది. ముఖ్యమంత్రి అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణిపట్ల రగిలిపోతోంది. దీంతో.. ముస్లింల సంక్షేమానికి ఉపయోగించాల్సిన వక్ఫ్ భూములను ఇతరులకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని, వక్ఫ్ చట్టాన్ని తుంగలో తొక్కే కూటమి ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తామని ఏపీ ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు వెయ్యి ఎకరాల వక్ఫ్ ఆస్తులను ఆక్రమణల చెర నుంచి విడిపించి ఆదర్శంగా నిలిస్తే.. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం వాటిని అన్యాక్రాంతం చేస్తోందని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వక్ఫ్ భూములు మిగలవని.. దీన్ని అడ్డుకునేలా ముస్లిం సమాజం, ముస్లిం మేథావులు, న్యాయవాదులు పోరాటానికి సిద్ధంకావాలని నాగుల్ మీరా పిలుపునిచ్చారు.