తిరుపతి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐఎం ప్రారంభం  | Sakshi
Sakshi News home page

తిరుపతి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐఎం ప్రారంభం 

Published Wed, Feb 21 2024 5:25 AM

PM Narendra Modi Opening of IIT Tirupati, ISAR, IIM Visakha - Sakshi

రేణిగుంట/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ తిరుపతిసిటీ/ఆనందపురం(విశాఖ)/ పెద్దారవీడు/కర్నూలు కల్చరల్‌: రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ప్రముఖ జాతీయ విద్యాసంస్థలైన తిరుç­³తి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐ­ఎం శాశ్వత ప్రాంగణాలు, కర్నూలు ఐఐఐటీ డీఎమ్‌ను ప్రధాని మోదీ మంగళ­వారం వర్చు­వల్‌ విధానంలో ప్రారంభించి జాతికి అం­కితమిచ్చారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో పాల్గొని తిరుపతి ఐఐటీ బృందాన్ని అభినందించారు.

కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటుచేసుకున్న ఐజర్‌(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌)ను ప్రధాని మోదీ జమ్ము నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఐజర్‌ డైరెక్టర్‌ శంతాను భట్టాచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి, జిల్లా కలెక్టర్‌ లక్ష్మిశా పాల్గొన్నారు. 

ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తిరుపతి  
తిరుపతి ఎడ్యుకేషనల్‌ హబ్‌గా పేరుపొందిందని ఎంపీ ఎం.గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మంగళవారం వర్చువల్‌ విధానం ద్వారా ప్రధాని ప్రారంభించిన పీఎం–యూఎస్‌హెచ్‌ఏ నిధుల మంజూరు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో మంచి ఎడ్యుకేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ అవుతోందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఉచ్ఛతర్‌ శిక్షా అభియాన్‌ పథకం కింద కేంద్రం మహిళా వర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు.

ఐఐఎం శాశ్వత క్యాంపస్‌ ప్రారంభం 
 విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద 241 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) శాశ్వత భవనాలను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్‌ పద్ధతిలో జమ్మూ నుంచి ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. 2016లో ఐఐఎం ప్రారంభం కాగా.. అప్పటి నుంచి ఏయూలో తాత్కాలిక క్యాంపస్‌లో నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా మొదట దశ భవనాలు అందుబాటులోకి రావడంతో విద్యాలయాన్ని శాశ్వత ప్రాంగణానికి మార్చారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, ఐఐఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  

 కేంద్రీయ విద్యాలయం ప్రారంభించిన ప్రధాని.. 
 ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని రాజంపల్లి గ్రామం సమీపంలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రభుదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ స్నేహలత మాట్లాడుతూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహకారంతో 8 ఏళ్ల కిందట తాత్కాలిక భవనాల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారన్నారు. కేంద్రం రూ. 25 కోట్లు కేటాయించడంతో ప్రస్తుతం 16 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా కేంద్రీయ విద్యాలయ భవనాల సముదాయాన్ని నిర్మించినట్లు చెప్పారు. 

Advertisement
Advertisement